బాగున్నారా!: కోర్టు ప్రాంగణంలో జగన్-గాలి జనార్ధన్ల నమస్కారం
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, కర్నాటక రాష్ట్ర మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డిలు గురువారం ఉదయం నాంపల్లి కోర్టు వద్ద ఎదురయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలకరించుకున్నారు.
తనకు ఎదురుపడిన గాలి జనార్దన్ రెడ్డిని చూసిన జగన్.. నమస్కారం పెట్టి, బాగున్నారా అంటూ పలకరించారు. దానికి ప్రతి నమస్కారం పెట్టిన గాలి.. బాగున్నానని చెప్పారు. ఇటీవల బెయిల్ పైన విడుదలైన గాలి తొలిసారి నాంపల్లి సీబీఐ న్యాయస్థానానికి హాజరయ్యారు.
కాగా, దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో గాలికి ఓబుళాపురం మైనింగ్స్ కట్టబెట్టారనే ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. వైయస్ కుటుంబానికి, గాలి కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయంటారు. అయితే, వైయస్ మృతి, కేసుల నేపథ్యంలో ఆ తర్వాత జగన్.. తనకు గాలి జనార్ధన్ రెడ్డి అంతగా తెలియదన్నట్లుగా మాట్లాడారు. దీని పైన అప్పుడు టీడీపీ విమర్శలు కూడా గుప్పించింది.
కాగా, దాదాపు నాలుగేళ్ల క్రితం ఆస్తుల కేసులో అరెస్టైన జగన్ ఏడాది తర్వాత విడుదలయ్యారు. గాలి కూడా అంతకుముందే అరెస్టయ్యారు. గాలి ఇటీవలే విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు కూడా గురువారం నాడు నాంపల్లి కోర్టులో ఎదురుపడ్డారు. ఆ సమయంలో పలకరించుకున్నారు.