రావట్లేదు, వ్యతిరేకం: టిపై జగన్ లేఖ, ఢిల్లీలో చంద్రబాబు
న్యూఢిల్లీ/హైదరాబాద్: తాను వ్యక్తిగత కారణాల వల్ల బిఏసి సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని, అసెంబ్లీ తిరస్కరించిన తెలంగాణ ముసాయిదా బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టవద్దని, తమ పార్టీ విభజనను వ్యతిరేకిస్తుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సభాపతికి లేఖ రాశారు.
విభజన బిల్లుపై జాతీయ నేతల మద్దతు కూడగట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీతో మంగళవారం ఉదయం బాబు భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3 గంటలకు సిపిఐ ప్రధాన కార్యదర్శి ఎబి బర్దన్తో, 4 గంటలకు సుష్మా స్వరాజ్తో, 5 గంటలకు లాలూ ప్రసాద్ యాదవ్తో బాబు సమావేశం కానున్నారు.
అద్వానీతో భేటీ అనంతరం చంద్రబాబు విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెసు పార్టీ కుట్రపూరిత రాజకీయాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తోందని మండిపడ్డారు. సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సిఎం ఓ వైపు దీక్ష చేస్తుంటే మరోవైపు తెలంగాణ ప్రాంత నేతలు ఆందోళన చేస్తారని, ఇదెక్కడి వైఖరని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలకు కూడా కాంగ్రెసు పార్టీ సమాధానం చెప్పుకోలేకపోతోందన్నారు.
రెండు ప్రాంతాల్లో సమన్యాయం జరగాలని తాము చెబుతున్నామని, ఇరు ప్రాంత నేతలతో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలని గతంలోనే చెప్పామన్నారు. కాంగ్రెసు అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్ర విభజనతో రాజకీయ లబ్ధి పొందాలని కాంగ్రెసు ఎదురు చూస్తోందని ధ్వజమెత్తారు.
సీమాంధ్ర టిడిపికి కాంగ్ సంఘీభావం
సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు మంగళవారం ఎపి భవన్ ఎదుట గల అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రాన్ని కాపాడాలంటూ నినాదాలు చేశారు. వీరి ధర్నాకు సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ మంత్రులు గంటా శ్రీనివాస రావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టిజి వెంకటేశ్, కాసు వెంకటకృష్ణా రెడ్డి తదితరులు సంఘీభావం తెలిపారు.