శ్రీశైలం నీటిపై మోడీకి జగన్ లేఖ: బాబుపై నిప్పులు
హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నీటి విడుదలపై ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఈ విషయాన్ని పార్టీ శాసనసభ్యుడు శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాయలసీమ తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితుల్లో ఉందని, కనీసం మంచినీరు కూడా దొరకడం లేదని జగన్ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఆ లేఖలో జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. చంద్రబాబుకు సొంత ప్రయోజనాలు, రియల్ ఎస్టేట్, ప్రచార స్టంట్లు తప్ప ప్రజా ప్రయోజనాలు ఏ మాత్రం పట్టడం లేదని ఆయన విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల తీరు బాధాకరంగా ఉందని ఆయన అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరు ముఖ్యమంత్రులను చర్చలకు పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆ లేఖలో జగనో కోరారు. రాయలసీమ గొంతు కోయవద్దని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులిద్దరూ అహంభావం వీడి ప్రజల సంక్షేమం గురించి ఆలోచించాలని శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలని, అక్కడి టిడిపి నాయకులు స్వప్రయోజనాల కోసం, రియల్ ఎస్టేట్ లాభాల కోసమే చూసుకుంటున్నారని ఆనయ అన్నారు.
శ్రీశైలం జలాశయం నీటి విడుదల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే.మంచినీటి అవసరాల కోసం శ్రీశైలంలో జలవిద్యుదుత్పత్తిని ఆపేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం అందుకు నిరాకరిస్తోంది. నిబంధనల మేరకే విద్యుదుత్పత్తి కొనసాగుతోందని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది.
విద్యుదుత్పత్తి ఆపకపోతే రాయలసీమలో మంచినీటికి కటకట ఏర్పడుతుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటోంది. ఈ నేపథ్యంలో ప్రధానికి జగన్ లేఖ రాశారు.