జగన్ ప్రత్యేక ఎఫెక్ట్: యువభేరీలో పాల్గొన్న ఏయూ ప్రొఫెసర్లకి నోటీసులు
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన యువభేరీకి హాజరైన ప్రొఫెసర్లకు సంబంధింత శాఖ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఆంధ్రా విశ్వవిద్యాలయ బందుకు విద్యార్థి పరిషత్ సంఘం పిలుపునిచ్చింది.
నోటీసులను వెనక్కి తీసుకోవాలని విద్యార్థి పరిషత్ సంఘం డిమాండ్ చేసింది. రాజకీయ ప్రయోజనాలు ఆశించి యువభేరీకి వెళ్లలేదని వారు అన్నారు. కేవలం ప్రతిపక్ష నేత విద్యార్థుల పట్ల వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని కోరేందుకే ప్రొఫెసర్లు వెళ్లారని చెప్పారు.
కాగా, యువభేరి సదస్సుకు హాజరైన ఆంధ్రా యూనివర్శిటీ ప్రొఫెసర్లకు విద్యాశాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. ఈ నోటీసులకు ప్రొఫెసర్లు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక హోదాపై నిర్వహించిన సదస్సులో మొత్తం ఆరుగురు ప్రొఫెసర్లు పాల్గొన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారంటున్నారు.
దాంతో వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారా? లేక సస్పెండ్ చేస్తారా? అని వర్శిటీ వీసీతో మంత్రి గంటా శ్రీనివాస రావు మాట్లాడినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రొఫెసర్లకు నోటీసులు ఇచ్చారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల విశాఖలో యువభేరీ నిర్వహించారు. ఇది ఆంధ్రా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ప్రసాద్ రెడ్డితో పాటు పలువురు ప్రొఫెసర్లు యువభేరీలో పాల్గొన్నారు.