చంద్రబాబు దూకుడును ఆపాలంటే ఒకటే మార్గం?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని ఆయన లెక్కచేయడంలేదని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. వరుసగా జిల్లాల పర్యటనలతో దూసుకువెళుతున్న చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే ఒకటే మార్గమని ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. అదేమిటంటే.. ముందస్తు ఎన్నికలు.

ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు అదే చర్చ
ఇచ్ఛాపురం నుంచి హిందూపురం వరకు ఎక్కడ చూసినా ఏపీలో ముందస్తు గురించే చర్చ నడుస్తోంది. చంద్రబాబు కూడా తన పర్యటనల్లో నాయకులకు స్పష్టంగా చెబుతున్నారు.. ఎన్నికలు ఏ క్షణంలోనైనా రావచ్చు అని.. వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెబుతున్నారు. 2023 వేసవిలోకానీ లేదంటే అదే ఏడాది నవంబరు, డిసెంబరు నెలల్లో ఎన్నికలు రానున్నాయంటూ పార్టీ శ్రేణులకు ఆయన నెలలతో సహా వివరించి చెబుతున్నారు. అందుకే తన ప్రతి జిల్లా పర్యటనలోను నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తున్నారు.

ముందుకు వెళ్లాలంటే కేంద్ర సహకారం కావాలి!
తాజాగా ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని, హోం మంత్రి అమిత్ షాను కలిసివచ్చారు. ఆ తర్వాత ముందస్తు గురించి చర్చ మరింత జోరుగా జరుగుతోంది. ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి అనుమతివ్వాలని, అలాగే సహకరించాలని జగన్ కేంద్ర పెద్దలను కోరినట్లు వార్తలు వస్తున్నాయి. వారు పచ్చ జెండా ఊపితే ఇబ్బంది ఉండదుకానీ ఊపకపోతేనే తిప్పలు తప్పవు. గవర్నర్ ను కలిసి అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేయాలని కోరిన తర్వాత కేంద్ర సహకారం అవసరమవుతుంది. పెద్దలు ఎదురుతిరగకుండా చూసుకోవాలి. వారు అంగీకరించకపోతే వెంటనే వ్యూహాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది.

కేంద్రంతో సఖ్యతగా ఉండే కేసీఆర్ ముందస్తు విజయం!
తెలంగాణలో కూడా భారత రాష్ట్ర సమితి కేంద్ర పెద్దలతో సఖ్యతగా ఉంటూ 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి ఘనవిజయం చేజిక్కించుకుంది. అటువంటి సత్సంబంధాలనే ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య జగన్ ఆశిస్తున్నారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందస్తుకు వెళ్లి అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగకపోతే వ్యవస్థ మొత్తం ఛిన్నాభిన్నమవుతుంది. గతంలో చంద్రబాబు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో ఈసీ ఎదురు తిరిగింది. అప్పుడు జరిగిందేమిటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

సమాధానం కోసం చూస్తున్న రాష్ట్ర ప్రభుత్వం?
2024 ఏప్రిల్ షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగడంకన్నా ముందస్తు జరిగితేనే తాము అధికారంలోకి వస్తామని ముఖ్యమంత్రి జగన్ నమ్మకంగా ఉన్నారు. సంక్షేమ పథకాలతోపాటు మూడు రాజధానులనేది కూడా తమను గెలిపిస్తుందని బలంగా నమ్ముతున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగిసిన వెంటనే ఏప్రిల్ లో అసెంబ్లీని రద్దుచేస్తారని, మే చివరి వారంలో ఎన్నికలు జరుగుతాయంటూ వార్తలు వస్తున్నాయి. వీటిని అటు వైసీపీ నాయకులుకానీ, ఇటు ప్రభుత్వ పెద్దలు కానీ ఖండించడంలేదు. అప్పటికి ఎన్నికలంటే ఒక ఏడాది ముందుగా ఎన్నికలు నిర్వహించినట్లవుతుంది. అయితే కేంద్ర పెద్దల నుంచి వచ్చే సమాధానం కోసం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది.












Click it and Unblock the Notifications