జగన్ నిర్ణయాలపై వైసీపీలో అసంతృప్తి..!
2024 ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పకుండా అధికారంలోకి వస్తాం, తామెంటో చూపిస్తామని గట్టిగా ప్రకటిస్తున్నారు. తనను నమ్ముకొని కేసులు ఎదుర్కొన్న వారిని గుర్తు పెట్టుకోండి , మనం అధికారంలోకి రాగానే న్యాయం చేస్తానని భరోసా ఇస్తున్నారు. అయితే, క్షేత్ర స్థాయిలో ఈ భరోసా కనిపించడం లేదని, పార్టీ వర్గాల్లో అసంతృప్తి ఉందని కథనాలు వస్తున్నాయి.
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించడంలో జగన్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం పార్టీ నాయకులను ఆశ్చర్యపరిచింది. ఎవరితోనూ సంప్రదించకుండానే తీసుకున్న ఈ నిర్ణయాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది పార్టీలో జగన్దే తుది నిర్ణయం అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది. జగన్ ప్రజలతో సంబంధాలు కొనసాగించినప్పుడే విజయం సాధించారని, కానీ ఇప్పుడు జనాలకు దూరమవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలో జగన్ అంటే జనం, జనం అంటే జగన్ అన్నట్లుగా ఉన్న పరిస్థితి ఇప్పుడు మారిపోయిందని, 2024 ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెబుతున్నారు. ఎన్నికల తర్వాత ప్రెస్ మీట్లు పెడుతున్నప్పటికీ, జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టకపోవడం పార్టీకి నష్టమేనని సొంత పార్టీ నాయకులు సైతం భావిస్తున్నారు. ఏదో ఒక పేరుతో బల ప్రదర్శనలకు దిగితే సరిపోదని, ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని సూచిస్తున్నారు. జగన్ తన పంథా మార్చుకోకపోతే వైసీపీ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications