జగన్, చంద్రబాబులను టార్గెట్ చేసి రైతుల పరిహారంపై వైఎస్ షర్మిల నయా డిమాండ్!
ఏపీలో వరదలకు దెబ్బ తిన్న పంటనష్టం ఎకరాకు 10వేలు కాదు..25వేల పరిహారం తక్షణం ఇవ్వాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి డిమాండ్ చేశారు. పెద్దాపురం మండలం, కండ్రుకోట గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన వైఎస్ షర్మిల ఏలేరు ఆధునీకరణపై వైఎస్ఆర్ కున్న చిత్తశుద్ది బాబు,జగన్ లకు లేదని మండిపడ్డారు. వరద ముంపుకు మీరంటే మీరే కారణం అని ఇద్దరూ విమర్శలు చేసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేశారు.
ఏలేరు వరద ముంపు ప్రభుత్వాల వైఫల్యం వల్లే
ఏలేరు రైతులను నిండా ముంచిందని, వేల ఎకరాలు నీట మునిగాయని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వాలే అని, గత వైసీపీ ప్రభుత్వం, ప్రస్తుత ఎన్దీయే కూటమి ప్రభుత్వం అన్నారు. ఏలేరు మరమ్మత్తుల మీద ఎవరు దృష్టి పెట్టలేదని అసహనం వ్యక్తం చేశారు. మరమ్మత్తులు లేక రైతులు దారుణంగా నష్టపోయారన్నారు.

రైతుల నష్టానికి సమాధానం చెప్పాలి
ఒక్కో రైతు ఇప్పటి వరకు 30 వేల వరకు పెట్టుబడి నష్టపోయారని, పెట్టిన పెట్టుబడి మొత్తం వరదపాలు అయిందని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. ఈ నష్టానికి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ఆర్ హయాంలో ఏలేరు ఆధునీకరణ పనులు చేపట్టారని, 135 కోట్లు కూడా విడుదల చేసి పనులు కూడా మొదలు పెట్టారని,వైఎస్ఆర్ చనిపోయాక ఏలేరు ఆధునీకరణ పై ఎవరు దృష్టి పెట్టలేదని విమర్శలు గుప్పించారు.
జగన్ మీద బాబు, బాబు మీద జగన్ ఆరోపణలు .. కానీ ఇద్దరూ దోషులే
ఇప్పుడు బాబు జగన్ తప్పిదమే అంటున్నాడు.. జగన్ బాబు తప్పిదం అంటున్నారు.. బాబు హయాంలో ఆధునీకరణ పనులు ఎందుకు చేయలేదు ? అని ప్రశ్నించారు. గత 10ఏళ్లుగా ఏలేరు ఆధునీకరణపై ఇద్దరికీ పట్టింపు లేదని తేల్చి చెప్పారు.జగన్ హయాంలో ప్రాజెక్టులను గాలికి వదిలేశారని, తట్టెడు మట్టి కూడా తియ్యలేదన్నారు. డ్యాంలు కొట్టుకు పోతున్నా జగన్ కి పట్టింపు లేదన్నారు.
నిర్లక్ష్యం ఫలితం రాష్ట్ర వ్యాప్తంగా 6లక్షల ఎకరాలకు నష్టం జరిగిందన్నారు.
ఎకరానికి 25 వేలు ప్రకటించాలి
చంద్రబాబు ఎకరాకు 10 వేల పరిహారం ఇస్తానన్నారని, అయితే 10 వేలు ఇస్తే ఏ మూలకు చాలుతుందో చెప్పాలన్నారు. కనీసం ఎకరాకు 25 వేల పరిహారం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. జగన్ హయాంలో ఎకరాకు 4 వేల పరిహారం అని మోసం చేశాడని, జగన్ చేసిన మోసం మళ్ళీ బాబు చెయ్యొద్దన్నారు.
తక్షణ పరిహారం ఇవ్వాలి
ఎన్డీయే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో జరిగిన నష్టంపై వెంటనే పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎన్డీయే ప్రభుత్వానికి రాష్ట్రం అంటే చిన్న చూపని ఆరోపించారు. రైతుల నష్టంపై పర్యటనకు రావాలని, రైతులకు అండగా ఉండాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు .












Click it and Unblock the Notifications