అసెంబ్లీలో ఉద్రిక్తం: చించేసిన టిడిపి, కాల్చేసిన జగన్పార్టీ
హైదరాబాద్: అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద రెండు ప్రాంతాలకు చెందిన తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. సోమవారం సభాపతి అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లును ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అనంతరం సభను అరగంట వాయిదా వేశారు.
ముసాయిదా బిల్లు ప్రతులను మీడియా పాయింటు వద్దకు తెచ్చిన సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ ప్రజా ప్రతినిధులు దానిని చించి వేశారు. దేవినేని ఉమా మహేశ్వర రావు, దూళిపాళ్ల నరేంద్ర తదితరులు దానిని చించివేశారు. దీంతో తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీ నేతలు దీనిని అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఈ దశలో పార్టీలోని ఇరుప్రాంత నేతల మధ్య వాగ్వాదం జరగడంతో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
తెలంగాణ రాష్ట్ర సమితి శాసన సభ్యులు కూడా బిల్లు ప్రతులను చించే ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ ఈ ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. అసెంబ్లీ పాయింటు వద్ద సమైక్య, తెలంగాణ నినాదాలు హోరెత్తాయి.
ముసాయిదా బిల్లును దగ్ధం చేసిన వైయస్సార్ కాంగ్రెసు
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు ముసాయిదా బిల్లును అసెంబ్లీ ప్రాంగణంలో దగ్ధం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ముసాయిదా బిల్లును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు దగ్ధం చేస్తుండటంతో తెరాస పరకాల ఎమ్మెల్యే కుర్చీ విసిరి అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో జగన్ పార్టీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి కిందపడిపోయారు.