వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా నిధుల విడుదల- వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు.
ఏపీలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల నిధుల్ని సీఎం జగన్ ఇవాళ విడుదల చేశారు. ఈ రెండు పథకాలకు చెల్లించే రూ.38 కోట్ల రూపాయల నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేశారు. పిల్లల చదువు ఇంటికి వెలుగు- ఇల్లాలి చదువు వంశానికే వెలుగని సీఎం జగన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అక్టోబరు- డిసెంబరు 2022 త్రైమాసికంలో పెళ్లిచేసుకున్న 4,536 మంది లబ్దిదారులకు వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ షాదీ తోఫా కింద రూ.38.18 కోట్ల ఆర్ధిక సాయాన్ని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేశారు.
అక్టోబరు, నవంబరు, డిసెంబరు నెలల్లో పెళ్లి చేసుకున్నవారికి ఒక నెల రోజుల పాటు దరఖాస్తు చేసుకునే అవకాశం ఇచ్చామని, అర్హులెవరూ మిస్ కాకూడదనే ఉద్దేశ్యంతో డిసెంబరులో పెళ్లి చేసుకున్నవారికి కూడా జనవరి చివరి వరకూ అవకాశం ఇచ్చి ఫిబ్రవరిలో వెరిఫికేషన్ పూర్తి చేసి ఇవాళ నేరుగా బటన్ నొక్కి వారికి సహాయం చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. ప్రతి సంవత్సరం ప్రతి మూడు నెలలకొకమారు ఈ కార్యక్రమం ఇలాగే జరుగుతుందన్నారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు పెళ్లి అయిన వారికి జనవరి చివరి వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఫిబ్రవరిలో వారికి ఇవ్వాల్సిన ప్రోత్సహకం అందుతుందన్నారు. అదే విధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలో పెళ్లి చేసుకున్నవారికి ఏఫ్రిల్ చివర వరకు దరఖాస్తు చేసుకునే అవకాశంఉంటుందని, వారికి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాన్ని మే నెలలో అందిస్తామన్నారు.

సమూలంగా ఒక మార్పు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా ఈ పథకం అమలు చేస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. పేదవాడి తలరాత మారాలంటే చదువు అనే అస్త్రం వారికి మనం ఇవ్వగలిగితేనే వాళ్ల తలరాతలు మారుతాయన్నారు. దీన్ని వైసీపీ ప్రభుత్వం గట్టిగా నమ్ముతుందన్నారు. అందుకే పేదవాళ్ల చదువులు మీద పెట్టే ప్రతి రూపాయిని, పిల్లలను చదివించడానికి పెట్టే ప్రతి రూపాయిని కూడా ఖర్చు కింద భావించడం లేదని, దాన్ని పిల్లకిచ్చే ఆస్తి కింద భావిస్తుందన్నారు. వాళ్ల జీవితాలు బాగుపడటానికి ఇది ఉపయోగపడాలనే తపన, తాపత్రయంతో ఆ పిల్లల కోసం ఆ కుటుంబసభ్యుడిగా, ఆ కుటుంబంలోని ప్రతి వారికి అండగా నిలబడే కార్యక్రమం చేస్తున్నామన్నారు.

ఈ రోజు మనం చేస్తున్న కార్యక్రమంలో వయస్సుతో పాటు చదువును కూడా అర్హతగా నిబంధన విధించామని, పెళ్లిళ్లు అయిన వాళ్లు చదువుకున్న వాళ్లు కాబట్టి వాళ్ల తరమే కాకుండా తర్వాత తరం కూడా ఆటోమేటిక్గా చదువులు బాట పట్టించే గొప్ప సాంప్రదాయానికి నాంది పలికామని సీఎం జగన్ పేర్కొన్నారు. వ్యవస్ధలో మార్పు జరుగుతుందని, దీని ద్వారా పిల్లల చదువులను ప్రోత్సహించడం, బాల్య వివాహాలను నివారించడం, డ్రాపౌట్స్ లేకుండా బడులలో చేరేవారి శాతాన్ని పెంచే కార్యక్రమాలు చేస్తున్నామన్నారు.













Click it and Unblock the Notifications