వైసీపీ కొత్త జాబితా: ఈ నియోజకవర్గాలకు అభ్యర్థుల మార్పు
YSRCP list: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల మార్పుల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకులను మార్చేసింది. వారి స్థానంలో కొత్త నాయకులను తెరమీదికి తీసుకొచ్చింది. గుంటూరు, ఒంగోలు, నెల్లూరు.. వంటి లోక్సభ స్థానాలకు కొత్త సమన్వయకులు అపాయింట్ అయ్యారు ఇదివరకే.
ఇప్పుడు ఇదే జాబితాలో మచిలీపట్నం లోక్సభ, అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా చేరాయి. ఈ రెండు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చివేసింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. గెలుపోటములకు సంబంధించిన నివేదికలు, స్థానిక నాయకుల అభిప్రాయాలు, అభ్యర్థుల మనోగతాలను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.

మచిలీపట్నం లోక్సభ స్థానానికి గతంలో సింహాద్రి రమేష్ బాబు పేరును ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే- అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ను ఇన్ఛార్జీగా నియమించింది. ఇప్పుడు తాజాగా వారిని అటు ఇటుగా మార్చింది. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేసింది.
మచిలీపట్నం లోక్సభకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, అవనిగడ్డ అసెంబ్లీకి సిట్టింగ్ శాసన సభ్యుడు సింహాద్రి రమేష్ బాబును ఇన్ఛార్జీలుగా అపాయింట్ చేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును అవనిగడ్డలోనే కొనసాగించాలంటూ స్థానిక నాయకత్వం కోరినట్లు చెబుతున్నారు.
2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో అవనిగడ్డ నుంచి 20 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారాయన. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ను మట్టికరిపించారు. ఇప్పుడు మండలి బుద్ధ ప్రసాద్కు టికెట్ దక్కేలా కనిపించట్లేదు. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications