రాపాక దొంగ ఓట్ల కామెంట్స్ పై విచారణ పూర్తి- వైసీపీ కార్యకర్తలు ఏం చెప్పారో తెలుసా ?
గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన తరఫున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత వైసీపీలోకి ఫిరాయించిన కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గ నేత రాపాక వరప్రసాద్ తాజాగా చేసిన దొంగ ఓట్ల వ్యాఖ్యలు ఆయన్ను చిక్కుల్లోకి నెట్టాయి. దీనిపై అందిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విచారణకు ఆదేశించారు. దీంతో తాజాగా విచారణ చేపట్టిన అధికారులు.. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారందరి నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు.
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో తాను దొంగఓట్లతోనే గెలిచానని, గత కొన్నేళ్లుగా తాను దొంగ ఓట్లతో ఎలా గెలుస్తున్నానో కూడా బహిరంగంగానే చెప్పేశారు. దీంతో ఈ వ్యవహారంపై ఈసీ విచారణ చేపట్టింది. విచారణకు రాపాకకు దొంగ ఓట్లు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని పిలిపించారు. అయితే ఇందులో వారు ఇచ్చిన వాంగ్మూలం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. దీని ఆధారంగానే అధికారులు విచారణ ముగించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్యే రాపాకకు దొంగఓట్లు వేసిన వ్యవహారంలో వాంగ్మూలం తీసుకునేందుకు అధికారులు పిలిపించిన వైసీపీ కార్యకర్తలు.. అప్పట్లో జనసేన ఎమ్మెల్యేగా నిలబడిన రాపాక వరప్రసాద్ కు దొంగ ఓటు ఎలా వేస్తామంటూ ప్రశ్నించినట్లు తెలిసింది. తాము వైసీపీ కార్యకర్తలమని, అప్పట్లో రాపాకకు తామెలా ఓట్లేస్తామంటూ ప్రశ్నించారు. దీంతో ఆర్డీవో సైతం అవాక్కయ్యారు. మరి తాను దొంగ ఓట్లతో గెలిచానంటూ ఎందుకు చెప్పాల్సి వచ్చిందనే అంశంపై రాపాకను సైతం ప్రశ్నించారు. ఆయన వివరణ కూడా తీసుకున్నాక నివేదికను కలెక్టర్ కు పంపేందుకు ఆర్డీవో సిద్ధమయ్యారు.
ఈ ఏడాది మార్చిలో అంతర్వేదిలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో రాపాక తాను దొంగఓట్లతోనే గెలిచానంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అధికారులు సీఈవో ఆదేశాల మేరకు విచారణ పూర్తి చేశారు. ఈ నివేదికను కలెక్టర్ పరిశీలించిన తర్వాత ఎన్నికల ప్రధానాధికారికి పంపుతారు. అనంతరం సీఈవో దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపధ్యంలో రాపాక విషయంలో సీఈవో తీసుకోబోయే నిర్ణయం ఆయన రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారింది.












Click it and Unblock the Notifications