రుషికొండ నిర్మాణాలపై వైసీపీ క్లారిటీ - ఆ శాఖ ఆధ్వర్యంలోనే..!!
విశాఖ రుషికొండ నిర్మాణాల పైన వైఎస్సార్సీపీ స్పష్టత ఇచ్చింది. అక్కడ నిర్మాణాల పైన తాజాగా రాజకీయ వివాదం చెలరేటంతో పార్టీ అక్కడ సచివాలయ నిర్మాణాలు జరుగుతున్నట్లుగా తొలుత ట్వీట్ చేసింది. తరువాత ఈ ట్వీట్ పొరపాటున చేసినట్లుగా వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని వైసీపీ అధికారిక ట్వట్టర్ ఖాతాలో స్పష్టం చేసింది.
విశాఖ కు ప్రాధాన్యత : ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం కొనసాగుతోంది. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఇప్పటికే ప్రతిపాదించారు. ఈ మేరకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల కేసు సుప్రీం కోర్టులో ఉంది. వచ్చే దసరా నుంచి ముఖ్యమంత్రి జగన్ విశాఖ కేంద్రంగా మూడు రోజుల అక్కడే ఉండి పాలనా వ్యవహారాలు పర్యవేక్షిస్తారని సమాచారం.

ఇదే సమయంలో రుషికొండ నిర్మాణాలకు సంబంధించి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. వీటిని మంత్రులు రోజా, అమర్నాధ్ ఖండించారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వమే కబ్జా చేస్తున్నారనే ఆరోపణలు ఏంటని మంత్రి అమర్నాధ్ ప్రశ్నించారు. ఇదే సమయంలో మంత్రి రోజా స్పందించారు.
మంత్రి రోజా స్పష్టత : పవన్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి రోజా మండిపడ్డారు. విశాఖను అంతర్జాతీయ సిటీగా తీర్చిదిద్దాలని వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుంటే.. పవన్ మాత్రం విశాఖను క్రైమ్ సిటీగా, అక్కడి ప్రజలను అవమానించే విధంగా మాట్లాడటం దురదృష్టకరమన్నారు. రుషికొండపై నిర్మాణాలకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చిందని, నిర్మాణాలు ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు.
మా అధికారిక ట్విట్టర్ ఖాతాలో రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణాలు జరుగుతున్నట్టుగా నిన్న చేసిన ట్వీట్లో పొరపాటున పేర్కొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్మాణాలు చేస్తున్నట్టుగా దీన్ని పరిగణలోకి తీసుకోగలరు.
— YSR Congress Party (@YSRCParty) August 13, 2023
కోర్టుకంటే పవన్ కల్యాణ్ గొప్పవాడా..? అని ప్రశ్నించారు. రుషికొండపై ఏం అక్రమాలు జరిగాయో పవన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ కేసు హైకోర్టులో ఉందని, ప్రభుత్వం చేసే ప్రతి డెవలప్మెంట్ ఎప్పటికప్పుడు అఫిడవిట్ రూపంలో అందిస్తున్నామని, కోర్టు మార్పులు చెబితే అవి ప్రభుత్వం చేస్తుంది.. పవన్కు మధ్యలో బాధేంటి..? అని ప్రశ్నించారు.
పవన్ వ్యాఖ్యలపై ఆగ్రహం : రుషికొండపై రామానాయుడు స్టూడియో పవన్కు కనబడలేదా అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. లోకేష్ తోడల్లుడు, బాలకృష్ణ అల్లుడు గీతం యూనివర్సిటీ కబ్జా పవన్కు కనబడలేదా అని ప్రశ్నించారు. రుషికొండ పర్యటన పేరుతో పవన్ హడావుడి చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. విశాఖ ను పరిపాలన రాజధానిగా ఎంచుకున్న నాటి నుంచి చంద్రబాబు, పవన్ విషం చిమ్ముతున్నారని, ప్రభుత్వ భూములను అభివృద్ధి చేస్తుంటే పవన్కు బాధేంటని మంత్రి రోజా నిలదీసారు.












Click it and Unblock the Notifications