అంబానీ రిక్వెస్ట్కు జగన్ ఓకే: ఇద్దరు మాజీ మంత్రులకు ఖరారు: వైసీపీ నుండి పెద్దలసభ అభ్యర్ధులు ప్రకటన
ముఖ్యమంత్రి జగన్ తమ పార్టీ నుండి పెద్దల సభకు పంపే నలుగురి పేర్లు ఖరారు చేసారు. ఊహించని విధంగా తన కేబినెట్ లోని ఇద్దరు బీసీ మంత్రులను పెద్దల సభకు పంపాలని డిసైడ్ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా తగ్గించి..బీసీలకు అన్యాయం చేసారంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Recommended Video

తాను కష్టాల్లో ఉన్న సమయంలో తనతో కలిసి నడిచిన వారికి తాను గుర్తింపు ఏ విధంగా ఇచ్చేదీ నిరూపించుకొనే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక, మూడో స్థానం పార్టీ స్థాపన నుండి తనతో నిలిచిన అయోధ్య రామిరెడ్డికి మరో సీటు కేటాయించారు. ఇక, స్వయంగా ముఖేష్ అంబానీ స్వయంగా వచ్చి నత్వానీకి రాజ్యసభ ఇవ్వాలని అభ్యర్ధించటంతో ఆయనకు సైతం జగన్ ఓకే చేసేసారు. ఈ నాలుగు పేర్లను అధికారికంగా ప్రకటించారు.

ఆ ఇద్దరు మంత్రులను..పెద్దల సభకు
జగన్ కేబినెట్ లో ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటుగా మరో మంత్రి మోపిదేవి వెంకటరమణను పెద్దల సభకు పంపాలని జగన్ డిసైడ్ అయ్యారు. ఏపీలో శాసన మండలి రద్దు సమయంలోనే వారిద్దరి రాజకీయ భవిష్యత్ తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. వైయస్సార్ మరణం నాటి నుండి పిల్లి సుబాష్ చంద్రబోస్ పూర్తిగా జగన్ తోనే నిలిచారు. ఆయన కు జగన్ 2019 ఎన్నికల్లో తూర్పు గోదావరి జిల్లా మండపేట నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయితే అప్పటికే ఎమ్మెల్సీగా ఉండటంతో జగన్ తన కేబినెట్ లో బీసీ కోటాలో ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టారు. గోదావరి జిల్లాల్లో ప్రభావం చూపే శెట్టి బలిజ వర్గానికి చెందిన బోస్ కు ఇప్పుడు రాజ్యసభ సీటు ఇవ్వటం ద్వారా ఆ వర్గానికి మరింతగా దగ్గరయ్యేందుకు జగన్ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకున్నారు.
ఇక, మోపిదేవి గతంలో వైయస్పార్ హాయంలో మంత్రిగా పని చేసారు. ఆయన వాన్ పిక్ వ్యవహారంలో సీబీఐ విచారణ ఎదుర్కొని జగన్ తో పాటుగా జైలు శిక్ష అనుభవించారు. 2019 ఎన్నికల్లో రేపల్లె నుండి పోటీ చేసి ఓడిపోయారు. అయినా..తనతో పాటుగా తొలి నుండి నిలిచిన మోపిదేవిని కేబినెట్ లోకి తీసుకొని జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మండలి రద్దు నిర్ణయం తో వారిద్దరనీ రాజ్యసభకు ఖరారు చేస్తూ జగన్ నిర్ణయించారు.

అంబానీకి మాట ఇచ్చిన విధంగానే..
ఇక, తన వ్యాపార భాగస్వామిగా ఉంటూ..తొలి నుండి రాజకీయంగా తనకు అండగా నిలిచిన అయోధ్య రామిరెడ్డికి సైతం జగన్ రాజ్యసభ సీటు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. 2014 ఎన్నికల్లో నర్సరావు పేట నుండి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వలేదు. అదే కుటుంబానికి చెందిన మోదుగుల వేణుగోపాల రెడ్డికి ఎంపీగా సీటు ఇవ్వటం.. అదే విధంగా అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆళ్ల రామక్రిష్టారెడ్డికి మంగళగిరి నుండి గెలిస్తే కేబినెట్ లో స్థానం కల్పిస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే, సామాజిక సమీకరణాలతో చివరి నిమిషంలో ఆళ్ల రామక్రిష్టా రెడ్డికి కేబినెట్ లో స్థానం దక్కలేదు.
దీంతో..ఇప్పుడు అయోధ్య రామిరెడ్డిని రాజ్యసభకు పంపాలని జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక, ప్రముఖ పారిశ్రామిక వేత్త స్వయంగా వచ్చి తమ సహచరుడు పరిమల్ నత్వానీకి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరటంతో..జగన్ దీని పైన పార్టీ నేతలతో చర్చించారు. అయితే, భవిష్యత్ అవసరాలను పరిగణలోకి తీసుకొని నత్వానీకి సైతం సీటు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. మూడు స్థానాలు వైసీపీకి..ఒకటి స్వతంత్ర అభ్యర్ధిగా నత్వానీని ఏపీ నుండి పెద్దల సభకు పంపనున్నారు.

వారికి నేతల బుజ్జగింపులు..
ఒక దశలో సోదరి షర్మిళ పేరు ప్రచారంలోకి వచ్చింది. ఇక, రాజ్యసభ సీట్ల పైనా పార్టీ నేతలు పలువురు ఆశలు పెట్టుకున్నారు. వారిలో వైవీ సుబ్బారెడ్డి..బీదా మస్తానరావు..మేకపాటి రాజమోహన రెడ్డి..పండుల రవీంద్ర బాబు వంటి వారు ఉన్నారు అయితే, రానున్న రోజుల్లో మరిన్ని సీట్లు వైసీపీకి రానున్నాయి. 2024 నాటికి మొత్తంగా 12 మంది వైసీపీ నుండి రాజ్యసభ లో సభ్యులుగా ఉండనున్నారు. ఇప్పుడు ఆశిస్తున్న వారికి భవిష్యత్ లో అవకాశం కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.
అయితే, ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో బీసీ రిజర్వేషన్ల అంశం ద్వారా రాజకీయంగా టీడీపీ ముఖ్యమంత్రిని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తోంది. దీంతో..ఇప్పుడు ఏకంగా ఇద్దరు బీసీ లకు రాజ్యసభ అవకాశం ఇవ్వటం ద్వారా..పూర్తిగా పై చేయి సాధించాలని జగన్ భావిస్తున్నారు. ఆశావాహులను బుజ్జగించి.. అంబానీ మాటకు విలు ఇస్తూ..బీసీలకు పెద్ద పీట వేస్తూ..ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ నుండి నలుగురు రాజ్యసభ సభ్యులను ప్రకటించారు.












Click it and Unblock the Notifications