డోర్స్ క్లోజ్: జగన్ పార్టీ హౌస్ఫుల్, చిరు మంత్రికి నో!

సీమాంధ్రలో ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ హవా కొనసాగుతోంది. గతంలో వైయస్ రాజశేఖర రెడ్డి మృతి, జగన్ జైలుకు వెళ్లడం తదితర అంశాలు ఆ పార్టీకి సానుభూతి రూపంలో కలిసి వచ్చేలా చేసింది. ఇప్పుడు ఆ పార్టీ సమైక్యవాదం స్టాండ్ కలిసి వచ్చేలా చేస్తుందంటున్నారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడం ద్వారా కాంగ్రెసు పార్టీ పని సీమాంధ్రలో అయిపోయిందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చింది. జగన్ మాత్రం విభజనను వ్యతిరేకిస్తోంది. సమైక్యవాదం బలంగా వినిపిస్తోంది. సమైక్య స్టాండ్ వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీకి లబ్ధి చేకూర్చే అవకాశముంది.
ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు పలువురు నేతలు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. కొందరు కాంగ్రెసు నేతలు జగన్, ఆ పార్టీ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారట. అయితే ఇప్పటికే హామీ ఇచ్చిన నలుగురైదుగురికి తప్ప మిగిలిన వారు టిక్కెట్లు ఆశించి వస్తే మాత్రం పార్టీలోకి తీసుకునే అవకాశాలు లేవంట.
సీమాంధ్రలో ఇప్పటికే ఆయా లోకసభ, శాసన సభ నియోజకవర్గాలకు పార్టీలో పోటా పోటీ నెలకొంది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి రెండు రోజుల క్రితం జగన్ పార్టీలో చేరారు. మంత్రి విశ్వరూప్ జగన్ పార్టీలో చేరేందుకు రాజీనామా చేశారు. రాయలసీమ ప్రాంతం నుండి మరో ఇద్దరు ముఖ్య నేతలు చేరనున్నారట.
హామీ ఇచ్చినందువల్ల వారికి మినహాయించి.. మిగిలిన వారు పార్టీలో పని చేసేందుకు సిద్ధమైతే చేరవచ్చునని టిక్కెట్లు ఆశించి వస్తే మాత్రం తీసుకోవద్దని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుందట.
కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు తొలుత జగన్ వైపు వెళ్తారని ప్రచారం సాగింది. అయితే ఆయన డబుల్ గేమ్ ఆడుతున్నారని ఆ పార్టీ నేతలు పలువురు భావిస్తున్నందువల్ల ఆయన వచ్చినా తీసుకోవద్దని నిర్ణయించుకున్నారట.












Click it and Unblock the Notifications