ఈసారి బీజేపీ మద్దతు టీడీపీకేనా ! వైసీపీ ఫిక్స్- ఎదురుదాడి మొదలు..
ఏపీలో అధికార వైసీపీతో పాటు విపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన కేంద్రం మద్దతు లేకపోతే తాము ఎన్నికల్ని ఎదుర్కోలేమనే పరిస్దితికి వచ్చేసిన నేపథ్యంలో ఈసారి ఎన్నికలు రసకందాయంగా మారబోతున్నాయి. అయితే గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీపై చేసిన ధర్మపోరాటం నేపథ్యంలో విపక్షంలో ఉన్న వైసీపీకి పూర్తిస్దాయిలో మద్దతిచ్చిన బీజేపీ.. ఈసారి మాత్రం తమ స్టాండ్ మార్చుకుని తిరిగి టీడీపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతోంది.
తాజాగా ఏపీలో పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా వైసీపీ సర్కార్ పై చేసిన మాటల దాడి అధికార పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేసినట్లయింది. అయితే వెంటనే కోలుకున్న వైసీపీ నేతలు.. బీజేపీపై ఎదురుదాడి ప్రారంభించారు. అమిత్ షా, నడ్డా వ్యాఖ్యల్ని తప్పుబడుతూ వైసీపీ కీలక నేతలైన విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఎదురుదాడి ప్రారంభించగా.. అటు సీఎం జగన్ సైతం ఈసారి వైసీపీకి బీజేపీ మద్దతు ఉండకపోవచ్చని చెప్పేశారు. తద్వారా గతంలో తాము వారి మద్దతు తీసుకున్నట్లు చెప్పకనే చెప్పారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ మద్దతు అవసరం కావడంతో దానికి బదులుగా ఏపీలో మద్దతిచ్చేందుకు బీజేపీ అంగీకరించినట్లే కనిపిస్తోంది. దీంతో ఈ వ్యవహారాన్ని ముందుగానే ఊహించిన వైసీపీ ఎదురుదాడి ప్రారంభించింది. అయితే వైసీపీ చేస్తున్న పోరు ఏ స్దాయికి వెళ్తుందన్న దానిపై వచ్చే ఎన్నికల్లో బీజేపీ మద్దతు ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈసారి టీడీపీకి బీజేపీ మద్దతిచ్చే అవకాశం ఉందని తాజాగా అమిత్ షా, జేపీ నడ్డా వంటి వారి వ్యాఖ్యలతో తేలిపోవడంతో వైసీపీ ఎదురుదాడిని ప్రకటించింది. ఇవాళ ఒక్కరోజే వైసీపీ నేతలు వరుసగా బీజేపీని, టీడీపీతో కలిసి టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. అయితే వైసీపీ ఈ వార్ ను కొనసాగిస్తుందా లేక తాత్కాలిక కౌంటర్లతో సరిపెడుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే షా, నడ్డా మొదలుపెట్టిన దాడిని ఇతర బీజేపీ నేతలు కూడా కొనసాగిస్తే అప్పుడు వైసీపీ ఎలా వ్యవహరిస్తుందన్న దానిపై భవిష్యత్ రాజకీయం ఆధారపడబోతోంది.












Click it and Unblock the Notifications