టీడీపీ కోటపై జగన్ స్పెషల్ ఫోకస్- కోఆర్డినేటర్కు గ్రాండ్ ఎంట్రీ..!!
బాపట్ల: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఒకటి.. పర్చూరు. గతంలో దగ్గుబాటి కుటుంబం, ఇప్పుడు టీడీపీ శాసన సభ్యుడు ఏలూరు సాంబశివరావు గట్టిపట్టు సాధించారు ఈ స్థానంపై. 2019 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని సైతం తట్టుకుని టీడీపీ నిలవగలిగిందిక్కడ. ఏలూరు సాంబశివరావు వరుసగా రెండోసారి విజయం సాధించారు.

కీలక స్థానం..
అలాంటి కీలకమైన నియోజకవర్గాన్ని మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ చేతిలో పెట్టారు. ఈ నియోజకవర్గానికి సమన్వయకర్తగా నియమించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు ఉన్న ఆయనకు పర్చూరు నియోజకవర్గాన్ని అప్పగించడంతో సమీకరణాలు ఒక్కసారిగా వైసీపీకి అనుకూలంగా మారిపోయాయి. పైగా వైఎస్ జగన్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో- స్థానిక నాయకులు విభేదాలు పక్కనపెట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పర్చూరు నియోజకవర్గంలో పర్యటన..
ఈ పరిణామాల మధ్య ఆమంచి కృష్ణ మోహన్.. పర్చూరుకు వచ్చారు. కోఆర్డినేటర్ గా నియమితులైన తరువాత తొలిసారిగా నియోజకవర్గానికి రావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు గ్రాండ్ గా స్వాగతం పలికారు. కారంచేడులో వైసీపీ నాయకులు, కార్యకర్తలు భారీ ప్రదర్శన నిర్వహించారు. గజమాలతో సన్మానించారు.

సీనియర్ నేతలతో..
అంతకుముందు- పందిళ్లపల్లిలోని ఆమంచి కృష్ణమోహన్ నివాసానికి పలువురు వైసీపీ సీనియర్ నాయకులు చేరుకున్నారు. ఆయనను అభినందించారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు ఆయనను కలుసుకున్నారు. నియోజకవర్గ కోఆర్డినేటర్ గా బాధ్యతలను స్వీకరించినందున అభినందనలు తెలియజేశారు. వైసీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత, పోతుల సురేష్ సహా పలువురు నాయకులు ఆమంచిని కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు.

దగ్గుబాటి దూరం..
నిజానికి- 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు పోటీ చేశారు గానీ.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు చేతిలో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత ఆయన వైఎస్ఆర్సీపీలో క్రియాశీలకంగా వ్యవహరించట్లేదు. దాదాపుగా పార్టీకి దూరం అయ్యారు. దీనితో వైఎస్ జగన్.. ఆమంచి వైపు మొగ్గు చూపారు. ఆయనను కోఆర్డినేటర్ గా అపాయింట్ చేశారు.

చీరాలకు దూరం..
ఈ పరిణామాలతో ఆమంచి కృష్ణమోహన్ తన సొంత నియోజకవర్గం చీరాలకు దూరం అయినట్టే కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల ఇక్కడ ఆయనకు చేతినిండా పని ఉన్నట్టే. పార్టీ నాయకులను సమన్వయం చేసుకోవడం, క్షేత్రస్థాయిలో పర్యటనలు చేపట్టడం, ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడం, గడప గడపకు మన ప్రభుత్వం వంటి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications