పార్టీ మారాలని అడిగారు, అయితే - బొత్సా సంచలనం..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్థానిక ఎన్నికల వేళ కూటమి- వైసీపీ మధ్య కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. విజయనగరం కేంద్రంగా వైసీపీని దెబ్బ తీసే విధంగా కూటమి వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో ఇక్కడ పార్టీ పరంగా మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. జిల్లా అధ్యక్షుడితో పాటుగా పలు మార్పులు చేసారు. కాగా.. బొత్సా పార్టీ మార్పు పైన ఊహాగానాలు సాగుతున్న వేళ.. ఆయనే స్వయంగా ఈ విషయం పైన స్పష్టత ఇచ్చారు.
విజయనగరంలో కూటమి- వైసీపీ మధ్య కొత్త రాజకీయ పోరు మొదలైంది. చిన్ని శ్రీను టీడీపీలో చేరటంతో వైసీపీ అప్రమత్తం అయింది. అదే బాటలో మరో మాజీ ఎమ్మెల్యే ఉన్నారనే ప్రచారం తో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇదే సమయంలో బొత్సా సైతం పార్టీ మారుతారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. చిన్ని శ్రీను పార్టీ మార్పు తరువాత జరుగుతున్న పార్టీ సమావేశాల్లో ఆయన పేరు ప్రస్తావన వేళ.. బొత్సా ఎమోషనల్ అవుతున్నారు. ఆయనతో ఉన్న అనుబంధం గుర్తు చేసు కొంటున్నారు. ఇదే సమయంలో పార్టీ మార్పు అంశం పైనా స్పందించారు. తనకు పార్టీ మారాలని గతంలోనే ఆఫర్ వచ్చిందని.. తాను విలువలకు కట్టుబడి ఆ ప్రతిపాదన తిరస్కరించానని బొత్సా వెల్లడించారు. తాను వైసీపీలోనే తన కుటుంబంతో సహా కొనసాగుతున్నట్లు స్పష్టం చేసారు. కాగా.. ఇదే సమయంలో జిల్లా కేంద్రంగా కొత్త చర్చ మొదలైంది.

జిల్లాలో వేగంగా మారుతున్న సమీకరణాలు
కాగా.. మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు నడవనున్నట్టు జిల్లాలో ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తరువాత కూడా బడ్డుకొండ అప్పలనాయుడు అనుకున్న స్థాయిలో క్రియాశీలకంగా లేరు. పైగా పూసపాటి అశోక్గజపతి రాజుకు గవర్నర్ ఎంపిక సమయంలో బహాటంగానే ఆనందం వ్యక్తం చేశారు. జిల్లాకు వన్నె తెచ్చారంటూ కొనియాడారు. ఇప్పుడు బావ చిన్న శ్రీను పార్టీ మారడంతో ఆయన సైతం అనుసరిస్తారన్న ప్రచారం జిల్లా వర్గాల్లో ఉంది. అయితే.. ఇప్పుడు నెల్లిమర్ల ఇంఛార్జ్ గా నెల్లిమర్ల జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు ను నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ చీఫ్ జగన్ నియమించారు. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ అప్పలనాయుడు సైతం పార్టీ వీడటం ఖాయమని చెబుతున్నారు. దీంతో.. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రాజకీయంగా ఆసక్తిగా మారుతున్నాయి.













Click it and Unblock the Notifications
