చంద్రబాబు-అయ్యన్నల పైన చర్యలు తీసుకోవాలి : వైసీపీ నేతల ఫిర్యాదు..!!
ముఖ్యమంత్రి జగన్ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తే నిరసన తెలియచేస్తున్న తమ మీద చంద్రబాబు దాడి చేయించారని వైసీపీ నేతలు డీజీపీకి ఫిర్యాదు చేసారు. టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న చేసిన వ్యాఖ్యల కు నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ చంద్రబాబు నివాసం వద్ద నిరసన చేసేందుకు వెళ్లారు. అక్కడ అడ్డుకున్న టీడీపీ నేత బుద్దా వెంకన్న..ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. రెండు పక్షాల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రమేష్ కారు పైన రాళ్ల దాడి జరిగింది.
దీంతో..ఈ వ్యవహారం పైన వైసీపీ నేతలు డీజీపీని కలిసారు. అయ్యన్న పాత్రుడు.. చంద్రబాబుపై డీజీపీ గౌతం సవాంగ్కి వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్ చేయాలని వైఎస్సార్సీపీ నేతలు కోరారు. టీడీపీ నేతల వ్యాఖ్యలను ప్రజలు గమనిస్తున్నారని, చంద్రబాబు డైరెక్షన్లో అంతా జరుగుతోందన్నారు. ఎమ్మెల్యే జోగి రమేష్పై దాడిని ఖండిస్తున్నామన్నారు. రాజకీయంగా టీడీపీకి మనుగడ లేదన్నారు. జరిగిన అన్ని ఘటనల వెనుక చంద్రబాబు హస్తం ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మేరుగ నాగార్జున ఆరోపించారు.
చంద్రబాబుని అరెస్ట్ చేయాలని డీజీపీని కోరామని ఆయన తెలిపారు. అయ్యన్నపాత్రుడు అత్యంత నీచంగా మాట్లాడారని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జోగి రమేష్పై భౌతిక దాడికి దిగడం అత్యంత దారుణమన్నారు. అయ్యన్నపాత్రుడితో మాట్లాడించింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు, టీడీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు, అయ్యన్నపై చర్యలు తీసుకోవాలని కోరామని ఆర్కే తెలిపారు. చంద్రబాబుకు రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని ఎంపీ సురేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల మధ్య చంద్రబాబు విద్వేషాలను రెచ్చగొడుతున్నారని నిప్పులు చెరిగారు. అయ్యన్న పాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సభ్య సమాజం తలదించుకునేలా అయ్యన్న మాట్లాడారని ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్లిన తనపై దాడి చేశారన్నారు. గూండాలు, రౌడీలతో చంద్రబాబు దాడి చేయించారని ధ్వజమెత్తారు. 'వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు.. వ్యవసాయాన్ని పండగ చేసి చూపించిన వ్యక్తి సీఎం జగన్ అని జోగి రమేష్ అన్నారు.