వందమంది లీడర్లు తయారుచేస్తాం : సతీష్ రెడ్డి వైసీపీలో చేరడంపై బీటెక్ రవి షాకింగ్ కామెంట్స్.. !
కడప: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అరాచక పరిపాలన కొనసాగిస్తోందని, తమ మాట వినని లీడర్లపై తప్పుడు కేసులు బనాయించి, భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలుగుదేశం పార్టీ కడప జిల్లా నాయకులు ఆరోపించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏకగ్రీవంగా, ఏకపక్షంగా గెలుచుకవడానికి తమ పార్టీ నాయకులను బెదిరిస్తోందని ఆరోపించారు.
పులివెందులకు టీడీపీ సీనియర్ నాయకుడు, శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఎస్వీ సతీష్ కుమార్ రెడ్డి వైసీపీలో చేరబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, బీటెక్ రవి మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సతీష్ రెడ్డి వీడి వెళ్లినంత మాత్రాన పులివెందులలో పార్టీ బలహీనపడినట్టు కాదని, వందమంది లీడర్లను తయారు చేయగల సత్తా తమకు ఉందని అన్నారు.

వైసీపీ నాయకులు అధికార బలంతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. పోటీ చేసే అభ్యర్థులను భయాందోళనకు గురి చేస్తున్నారని, వారిని పోటీ నుంచి తప్పుకొనేలా బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులపై పాత కేసులను తిరగదోడుతున్నారని విమర్శించారు. అధికారం శాశ్వతం కాదని, వ్యవస్థ శాశ్వతమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.
బెదిరింపులకు పాల్పడుతోన్న వైసీపీ నాయకులపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని హెచ్చరించారు. వైసీపీ అరాచకాలను ఎదుర్కొనడానికి ధీటుగా స్పందిస్తామని చెప్పారు.
పార్టీని వీడాలని సతీష్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం బాధ కలిగించిందని బీటెక్ రవి తెలిపారు. ఆయన రాజీనామాతో పులివెందులలో పార్టీ బలహిన పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎంతమంది లీడర్లు వెళ్లినా.. దానికి రెట్టింపు నాయకులను తయారు చేయగల సామర్థ్యం పార్టీ అధినేత చంద్రబాబుకు ఉందని చెప్పారు. పులివెందులలో పార్టీ బలంగా ఉందని అన్నారు. వైఎస్ కుటుంబంతో ఇబ్బందులు పడ్డవారంతా తమతోనే ఉన్నారని, బలమైన క్యాడర్తో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications