వైసీపీకి కొత్త వ్యూహకర్త - రంగంలోకి 'విజయ్' ను గెలిపించిన 'మాస్టర్ మైండ్' ..!!
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. 2029 ఎన్నికల కోసం ఇప్పటికే కూటమి - వైసీపీ సమాయత్తం అవుతున్నాయి. వచ్చే ఎన్నికలు రెండు వైపులా ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో.. ఇప్పటికే కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నాయి. కూటమి కలిసి ఉంటే జగన్ గెలుపు కష్టమనే విశ్లేషణలు ఉన్నాయి. జగన్ మాత్రం ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలి అనే లక్ష్యంతో కనిపిస్తున్నారు. ఇందు కోసం కొత్త వ్యూహకర్త కోసం మంత్రాంగం ప్రారంభించారు. తమిళనాడులో విజయ్ ను గెలిపించిన వ్యూహకర్త ఇప్పుడు వైసీపీ కోసం రంగం లోకి దిగుతున్నట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం.
ఏపీలో రాజకీయ పోరు నువ్వా నేనా అన్నట్లుగా సాగుతోంది. కూటమి నేతలు జగన్ లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కూటమి పైనా జగన్ పోరాటం తీవ్రతరం చేసారు. జిల్లాల పర్యటనలకు సిద్దం అవుతున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. టీడీపీకి రాజకీయ వ్యూహాలు అందించేందుకు కొంత కాలంగా ప్రత్యేకంగా ఒక టీం పని చేస్తోంది. అదే విధంగా వైసీపీకి 2019 లో ప్రశాంత్ కిశోర్, 2024 ఎన్నికల్లో రుషిరాజ్ సింగ్ టీంలు తెర వెనుక సేవలు అందించాయి. 2024 లో జగన్ ఓటమి తరువాత ఆ టీంతో ఒప్పందం రద్దయింది. ఇక, వచ్చే ఎన్నికల కోసం జగన్ కొత్త రాజకీయ వ్యూహకర్త కోసం మంతనాలు చేస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. ఇప్పటికే ఇద్దరు ప్రముఖ వ్యూహకర్తలతో చర్చలు చేసినా.. వారి నియామం పైన తుది నిర్ణయం తీసుకోలేదు. తాజాగా బెంగళూరు కేంద్రంగా ఇదే అంశం పైన కీలక మంత్రాంగం పార్టీ ముఖ్య నేతలు చేసినట్లు తెలుస్తోంది.

2029 ఎన్నికలే లక్ష్యంగా జగన్ నిర్ణయాలు
తమిళనాడు టీవీకే చీఫ్ విజయ్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన మాస్టర్ మైండ్ కపిల్ సాహు సేవలను వైసీపీ వినియోగించుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనల పైన చర్చలు జరిగి నట్లు సమాచారం. తొలుత ప్రశాంత్ కిశోర్ టీంతో కలిసి కపిల్ సాహు పని చేసారు. తాజాగా తమిళ నాడు ఎన్నికలకు రెండేళ్ల ముందుగా రంగంలోకి దిగిన కపిల్ సాహు ప్రత్యేకంగా డిజిటల్ ప్రచారం, ప్రజలతో మమేకం అయ్యే కార్యక్రమాల నిర్వహణ ద్వారా విజయ్ ను అన్ని వర్గాలకు దగ్గర చేసారు. ప్రచారంలోనూ కొత్త వ్యూహాలను అమలు చేసారు. విజయ్ గెలుపులో కీలకంగా పని చేసిన కపిల్ సాహు సేవలను విజయ్ ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ కోసం వ్యూహకర్త గా కపిల్ సాహు సేవలను వినియోగించుకోవాలని భావిస్తోంది. అందులో భాగంగా తొలి అడుగు వేసినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లుగా జరిగితే కపిల్ సాహు వైసీపీకి రాజకీయ వ్యూహకర్త గా రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications