రాత్రంతా పోలీసు స్టేషన్ లోనే విప్ జగ్గిరెడ్డి నిరసన : అక్కడే నిద్ర - బైఠాయింపు : సజ్జల ఆరా..!!
వైసీపీ ఎమ్మెల్యే..ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి నిరసనకు దిగారు. పోలీసు స్టేషన్ లో నిన్నటి నుంచి నిరసన కొనసాగిస్తున్నారు. స్థానిక పోలీసుల తీరుకు నిరసనగా స్టేషన్ లో బైఠాయించారు. రాత్రి స్టేషన్ లో నిద్రించారు. ఇప్పుడు ఈ వ్యవహారం పైన ప్రభుత్వ సలహాదారు ఆరా తీసారు. జగ్గిరెడ్డి నిరసనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కోనసీమ జిల్లా రావులపాలెం మండలంలో తన స్వగ్రామమైన గోపాలపురానికి చెందిన అమాయకులపై.. పోలీసులు కేసులు నమోదు చేశారని.. ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసారు.

స్టేషన్ లోనే ఎమ్మెల్యే నిద్ర
ఎమ్మెల్యేతో పోలీసు అధికారులు జరుపుత్ను చర్చలు చేసినా ఫలితం రాలేదు. జగ్గిరెడ్డికి మద్దతుగా వైసీపీ శ్రేణులు స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. నెల 5వ తేదీ రాత్రి గోపాలపురంలో జాతీయ రహదారి పక్కన ఒక హోటల్లో.. సిబ్బంది ఇచ్చిన ప్లేట్లపై అంబేడ్కర్ చిత్రాలు ఉండటంతో వారు నిర్వాహకుడిని అడిగారు. దీనిపై ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. హోటల్ నిర్వాహకుడు, ప్లేట్లు విక్రయించిన వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయగా, హోటల్ యజమానిని నిలదీసేందుకు వెళ్లిన యువకులు, వాట్సప్లో రెచ్చగొట్టేలా సందేశాలు పంపిన 18 మంది దళిత యువకులపై కేసు నమోదుచేసి రిమాండుకు పంపించారు.

పోలీసు అధికారులపై చర్యలకు డిమాండ్
దీని పైన వివాదం కొనసాగుతోంది. పార్టీ ప్లీనరీలో ఉన్న ఎమ్మెల్యే ఆదివారం మధ్యాహ్నం రావులపాలెం చేరుకుని వైకాపా కార్యాలయంవద్ద సమావేశం నిర్వహించి తప్పుడు కేసులు పెట్టడాన్ని ఖండించారు.అక్కడ నుంచి దళిత నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. రాత్రి పొద్దు పోయే వరకూ ఆందోళన కంటిన్యూ అయింది. రాత్రి స్టేషన్ లోనే నిద్రించి తన నిరసన వ్యక్తం చేసారు. జగ్గిరెడ్డికి మద్దతుగా ఎంపీ అనూరాధ సైతం స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సీఎ, ఎస్సైలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. ఇప్పటికే గ్రామంలో ఎస్సీ - ఎస్టీ కమిషన్ ఛైర్మన్ విక్టర్ ప్రసాద్ విచారణ చేసారు.

ఆరా తీస్తున్న ప్రభుత్వం..నిరసన కంటిన్యూ
ఎలాంటి విచారణ జరపకుండా అమలాపురం ఘటన తరహా సెక్షన్లతో కేసులు ఎందుకు పెట్టారని డీఎస్పీని జగ్గిరెడ్డి అడిగారు. ఈ రెండు విషయాలు తెలిపేవరకూ స్టేషన్ నుంచి వెళ్లనన్నారు. ఆందోళన కొనసాగుతోంది. అయితే, జగ్గిరెడ్డి నిరసన విరమించేలా పార్టీ అధినాయకత్వం మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు ఈ వ్యవహారం కోనసీమ జిల్లాతో పాటుగా వైసీపీ శ్రేణుల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. రావులపాలెం స్టేషన్ లో నిరసన కొనసాగిస్తుండటంతో.. అక్కడకు వైసీపీ నేతలు చేరుకుంటున్నారు.












Click it and Unblock the Notifications