గిరిజన మహిళపై నలుగురు యువకుల పైశాచికం: 'బాబు పాలనలో రక్షణ లేదు'
విజయవాడ: విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. భర్తను కూలి పనుల కోసం పంపించేందుకు వెళ్లి తిరిగి ఇంటికెళ్తున్న ఓ గిరిజన మహిళపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితురాలు, గ్రామస్తులు చెప్పిన వివరాలిలా ఉన్నాయి.
మెంటాడ మండలంలోని కొండలింగాలవలస పంచాయతీ పరధిలోని మూలపాడు గిరిజన గ్రామానికి చెందిన మహిళ(28) తన భర్త కూలి పనికోసం వేరే ప్రాంతానికి వెళ్తుండగా ఆయన్ను పంపించేందుకు బుధవారం రాత్రి ఆండ్రకు వచ్చింది. భర్తని బస్సు ఎక్కించాక నిత్యావసర సరుకులు, పిల్లలకు మిఠాయిలు కొనుక్కొని తిరిగి మూలపాడుకు బయల్దేరింది.
ఇంతలో ఆండ్రకు చెందిన నలుగురు వ్యక్తులు వచ్చి ఆండ్ర ఎస్టీ కాలనీ నీటి ట్యాంకు సమీపంలోకి మహిళను ఎత్తుకుపోయారు. అక్కడ నోట్లో గుడ్డ కుక్కి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను అక్కడ నగ్నంగా వదిలేసి పారిపోయారు. కొంతసేపటికి తెలివిరావడంతో ఆ మహిళ కేకలు వేసింది.
దాంతో సమీపంలో ఉన్న పలువురు స్థానికులు, మహిళలు వచ్చి ఆమెకు దుస్తులు అందించి నీరు తాగించారు. శరీరమంతా తీవ్ర గాయాలు కావడంతో ఆ రాత్రికి అక్కడే ఉండి గురువారం ఉదయం మూలపాడు వెళ్లి కులపెద్దలకు జరిగిన విషయాన్ని చెప్పింది. ఆ తర్వాత గ్రామపెద్దలతో కలిసి గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆండ్ర పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసింది.
భర్త తనకు ఇచ్చిన రూ.5 వేలను కూడా యువకులు లాక్కున్నారని బాధిత మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. నలుగురు వ్యక్తుల్లో ఎలుసూరి ఆది, సవరవిల్లి శంకరరావును గుర్తించానని, మిగతా ఇద్దరిని గుర్తించలేకపోయానని బాధితురాలు తెలిపింది. బాధితురాలికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
చిన్న పిల్లలు ఉన్నారని చెప్పినా వినకుండా తనపై అత్యాచారం చేశారని బాధితురాలు కన్నీరు మున్నీరు అవుతోంది. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
'బాబు పాలనలో రక్షణ లేదు':
చంద్రబాబు ప్రభుత్వంలో అత్యాచారాలు పెరిగిపోయాయని, గిరిజనులకు రక్షణ లేకుండా పోయిందని వైసీపీ ఎమ్మెల్యే రాజన్నదొర ఆరోపించారు. గిరిజన మహిళపై సామూహిక అత్యాచారం చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
నిందితులపై నిర్భయచట్టం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాల కింద కేసులు పెట్టాలని ఆయన కోరారు. చికిత్స పొందుతున్న బాధిత గిరిజన మహిళకు మెరుగైన వైద్య సేవలు అందేలా విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బాధ్యతలు తీసుకోవాలన్నారు.
అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మహిళా నేతలు
తెలుగుదేశం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు శోభాహైమావతి.. టీడీపీ ఎమ్మెల్సీ సంధ్యారాణి, స్థానిక ఎమ్మెల్యే గీతతోకలిసి శుక్రవారం జిల్లాలోని గోషా ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించారు. బాధితురాలికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళలపై లైంగిక దాడులను తగ్గించేందుకు టీడీపీ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.