రాధాకృష్ణని టార్గెట్ చేసిన రోజా: అదే ముఠా, నన్ను చంపే ప్రయత్నం!
హైదరాబాద్: వైసిపి నగరి ఎమ్మెల్యే, నటి రోజా ఆంధ్రజ్యోతి పత్రికను, ఆ పత్రిక ఎండీ రాధాకృష్ణను టార్గెట్ చేశారు. తాను టిడిపి ఎమ్మెల్యే అనితను అనని మాటలను రాధాకృష్ణ తన పత్రికలో అన్నట్లుగా రాశారని ఆమె శుక్రవారం నాడు మండిపడ్డారు.
ఆ ప్లాన్ టిడిపి కార్యాలయంలో జరిగిందా లేక ఆంధ్రజ్యోతిలో ప్రిపేర్ చేశారా అని మరో ఇష్యూను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అనితను తాను అనని మాటలను రాధాకృష్ణ అన్నట్లుగా రాశారని, దానికి ఆయన పైన ప్రివిలేజ్ కమిటీ చర్యలు తీసుకోవాలన్నారు. కఠినంగా ఆయనపై చర్యలు ఉండాలన్నారు.
వీడియోల్లో నేను తప్పుగా మాట్లాడినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్ చేశారు. తాను అనని మాటలను రాధాకృష్ణ రాయడం సరికాదన్నారు. సభ వీడియోలు ఎన్నోసార్లు ప్లే చేస్తున్నారని, అందులో తాను అనిత పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఉందా అని ప్రశ్నించారు.
సభను లైవ్ టెలికాస్ట్ చేయవచ్చునని, కానీ అనని మాటలను అన్నట్లు రాసిన వారిని మాత్రం కఠినంగా శిక్షించాలని రాధాకృష్ణను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఎవరో అసెంబ్లీలోకి వచ్చి సెల్ ఫోన్లో వీడియో తీశారని చెబుతారని, అలా వీడియో తీసిన వారిని శిక్షించరా అని ప్రశ్నించారు.
తన సస్పెన్షన్ విషయంలో కోర్టు అధికారాలను చంద్రబాబు ధిక్కరించారన్నారు. న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలో వేలు పెట్టవద్దని చెబుతారని, మరి అలాంటప్పుడు ప్రభుత్వ లాయర్ను కౌంటర్ వాదనలకు ఎందుకు పంపించారని ప్రశ్నించారు.
తన పైన ఏడాది సస్పెండ్ చేసిన మరుసటి రోజు తాను అడిగేందుకు స్పీకర్ వద్దకు వెళ్లేందుకు అసెంబ్లీకి వచ్చానని చెప్పారు. అప్పుడు తాను కూర్చుంటే కుక్కను లాగినట్లు లాక్కొని పోయారన్నారు. ఆ తర్వాత తను పోలీస్ స్టేషన్ తీసుకు వెళ్లారన్నారు. మార్షల్స్ తన పైన కూర్చున్నారన్నారు.
తన ప్రాణాలు కూడా తీసేందుకు ప్రయత్నించారంటే వారి తీరు అర్థం చేసుకోవచ్చున్నారు. ఆ తర్వాత జగన్ స్టేషన్కు వచ్చి.. ఆమెకు ఏమైనా అయితే కేసులు పెడతానని, ఆసుపత్రికి తరలించాలని హెచ్చరించడంతో, అప్పుడు తనను ఆసుపత్రికి పంపించారని చెప్పారు.
ఎన్టీఆర్ను చంపేందుకు ఏ ముఠా అయితే ప్లాన్ చేసిందే, వంగవీటి రంగా ముఠా పైన ఏ ముఠా అయితే ప్లాన్ చేసిందే, అదే ముఠా ఇప్పుడు రోజా పైన కుట్ర చేస్తోందన్నారు. తనను రాజకీయంగా సర్వనాశనం చేసేందుకు చంద్రబాబు.. ఓ ముఠాను వాడుకుంటున్నారన్నది నిజం కాదా చెప్పాలన్నారు.
జర్నలిస్టుల ముందు సవాలర్ చేస్తున్నానని.. సభలో ప్రజా సమస్యల పైన ఎవరు ఎక్కువగా మాట్లాడారు? ఎవరు తమ నియోజకవర్గ సమస్యల పైన మాట్లాడారో రికార్డులు చూస్తే తెలుస్తుందన్నారు. అలా చూస్తే టిడిపి వాళ్లే దోషులుగా తేలుతారన్నారు. నేను అనని మాటలను అన్నట్లుగా ఎలా రాస్తారని ప్రశ్నించారు. సస్పెన్షన్ విషయంలో న్యాయం కోసం సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు.