మరో ఛాన్స్: ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరవుతానన్న రోజా
హైదరాబాద్: ఏడాది సస్సెన్షన్పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సనీ నటి రోజాకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ మరో అవకాశం ఇచ్చింది. ఈ మేరకు ప్రివిలైజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6న ప్రివిలైజ్ కమిటీ ముందు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది.
గతంలో నాలుగుసార్లు విచారణకు హాజరు కావాలంటూ ప్రివిలైజ్ కమిటీ నోటీసులు పంపినప్పటికీ, రోజా వ్యక్తిగత కారణాల వల్ల విచారణకు గైర్హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఏడాది పాటు సస్సెన్షన్పై ప్రివిలైజ్ కమిటీ ఎప్పుడు పిలిచినా ఆ కమిటీ ముందు హాజరవుతానని రోజా ఇప్పటికే తెలిపారు.
తాను సభా హక్కుల కమిటీ ముందు ఈ నెల 6వ తేదీన హాజరవుతానని రోజా చెప్పారు. తాను వ్యక్తిగత కారణాల వల్ల ఇంతకు ముందు హాజరు కాలేకపోయానని అన్నారు. కమిటీ ముందు హాజరవుతానని అన్నారు.
ఎమ్మెల్యేగా ప్రివిలైజ్ కమిటీని గౌరవిస్తానని గతంలో ఆమె అన్నారు. గతేడాది డిసెంబర్ 22న అసెంబ్లీ జీరో అవర్లో ఎమ్మెల్యే రోజా అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను స్పీకర్ ఆమెపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించిన సంగతి తెలిసిందే.
సభలో రోజా వివాదంపై ప్రివిలైజ్ కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని బడ్జెట్ సమావేశాల్లో స్పీకర్ అన్న సంగతి తెలిసిందే. అసెంబ్లీలో రోజా తీరుపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఇవ్వనుంది. దీని కోసం రోజాకు నోటీసులు పంపారు.
బడ్జెట్ సమావేశాల్లో మంత్రి యనమల రోజా సస్పెన్షన్ విషయంలో సభ నిర్ణయమే సుప్రీం అన్నారు. ఏ రూల్ ప్రకారమైనా స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చన్నారు. రూల్స్ ప్రాధాన్యత కాదు, సభ నిర్ణయమే కీలకమన్నారు. సభ నిర్వహణ విషయంలో అన్ని రకాల అధికారాలు ఉన్నాయన్నారు.
ప్రివిలేజ్ కమిటీ నివేదిక ఆధారంగా వైఎస్సార్సీపీ నేతలు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీధర్ రెడ్డి, జ్యోతుల నెహ్రూల క్షమాపణలు అంగీకరిస్తున్నామన్నారు. అయితే అనారోగ్యం కారణంగా రోజా విచారణకు హాజరు కాలేరని వైయస్సారా కాంగ్రెస్ పార్టీ ప్రివిలేజ్ కమిటీకి ఇచ్చిన లేఖను సభ పరిగణనలోకి తీసుకుని, కమిటీ ముందు హాజరయ్యేందుకు రోజాకు అసెంబ్లీ మరో అవకాశం ఇచ్చిందని అన్నారు. అప్పటివరకు రోజా సస్పెన్సన్ కొనసాగుతోందని చెప్పారు.