రఘురామపై సహచర ఎంపీ షాకింగ్-సీబీఐ కేసుల ప్రస్తావన- రమేష్ ఆస్పత్రికి నో
ఏపీలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజును సీఐడీ అరెస్టు చేసిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై వైసీపీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. బయటికి ప్రభుత్వ చర్యల్ని సమర్ధిస్తున్న వైసీపీ నేతలు అంతర్గతంగా మాత్రం భిన్నరకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రభుత్వంలో కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు, రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి.. రఘురామ అరెస్టుపై తొలిసారి స్పందించారు. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపేలా ఉన్నాయి.
Recommended Video

రఘురామపై ఎంపీ మిధున్రెడ్డి ఫైర్
వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుపై సీఐడీ అరెస్టు అస్త్రం సంధించగానే పార్టీ నేతలంతా ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా సీఎం జగన్కు సన్నిహితుడు, రాజంపేట ఎంపీ మిధున్రెడ్డి రఘురామకృష్ణంరాజుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో రఘురామకు కల్పించిన స్దానంతో పాటు ఆయనపై సీబీఐ కేసుల్ని సైతం ప్రస్తావిస్తూ మిధున్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది.

బాబు డైరెక్షన్లోనే రఘురామ యాక్షన్
సీఐడీ అరెస్టు చేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వెనుక చంద్రబాబు ఉన్నారని, ఆయన డైరెక్షన్లోనే రఘురామకృష్ణంరాజు పనిచేశారని ఎంపీ మిధున్రెడ్డి ఆరోపించారు. టీడీపీ, చంద్రబాబు రఘురామరాజు కుటుంబాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని మిధున్రెడ్డి విమర్శించారు. వీరంతా కలిసి ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆయన వెల్లడించారు. టీడీపీ నేతలు అరెస్టు అయినప్పుడు కూడా చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయలేదని మిధున్రెడ్డి పేర్కొన్నారు.

బెయిల్ తిరస్కరించాకే దెబ్బల డ్రామా
రఘురామకృష్ణంరాజుకు ఎప్పుడైతే హైకోర్టు బెయిల్ తిరస్కరించిందోఅప్పుడే ఆయన డ్రామాలకు తెరలేపారని మిధున్రెడ్డి ఆరోపించారు. కస్టడీలో సీఐడీ పోలీసులు తనను కొట్టారంటూ రఘురామ చేస్తున్న విమర్శల్ని మిధున్రెడ్డి తోసిపుచ్చారు. పోలీసులు కొట్టలేదంటూ డాక్టర్లే కోర్టుకు నివేదిక ఇచ్చిన విషయాన్ని మిధున్రెడ్డి గుర్తుచేశారు. కేసును తప్పుదోవ పట్టించేందుకే రఘురామ ఇలాంటి డ్రామాలకు తెరతీస్తున్నారని మిధున్రెడ్డి మండిపడ్డారు.

రఘురామకు వైసీపీలో సముచిత స్ధానం
రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీలో సముచిత స్ధానం కల్పించామని ఎంపీ మిధున్రెడ్డి గుర్తుచేశారు. ఆయనపై రెండు సీబీఐ కేసులు కూడా ఉన్నాయని, అయినా ఆయనకు సముచిత స్ధానం ఇచ్చామన్నారు. కానీ ఈసారి రఘురామ వ్యాఖ్యలు కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయని మిధున్రెడ్డి తెలిపారు. ప్రస్తుత తరుణంలో రమేష్ ఆస్పత్రిలో చికిత్స కావాలని రఘురామరాజు కోరడం సరికాదని మిధున్రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications