గోదావరి వరదల్ని జగన్ ఆపలేదే ? చంద్రబాబు ట్వీట్-నువ్వైతే ఆపేస్తావుగా- సాయిరెడ్డి కౌంటర్
ఏపీలో గోదావరి వరద రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఓవైపు వరద ప్రభావంతో జనం బిక్కుబిక్కుమంటుంటే ఇదే అదనుగా రాజకీయ నేతలు మాటల యుద్దం సాగిస్తున్నారు. వరద సన్నద్ధతపై జగన్ సర్కార్ ను ప్రశ్నిస్తూ విపక్ష నేత చంద్రబాబు పెట్టిన ట్వీట్ వైసీపీలో కాకరేపింది. దీంతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి దీన్ని కౌంటర్ చేస్తూ, ఫ్లాష్ బ్యాక్ గుర్తుచేస్తూ చంద్రబాబుకు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ రెండు ట్వీట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
గోదారి వరదలపై చంద్రబాబు ట్వీట్
గోదావరిలో వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో గోదావరి జిల్లాల్లో,ముఖ్యంగా లంక గ్రామాల్లో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో వరదపై ప్రభుత్వం సన్నద్ధంగా లేదని ఆరోపిస్తూ విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన సీఎం జగన్ వరదపై సన్నద్ధంగా లేరని ఆరోపించారు. వరదతో పోలవరం సహా పలు ప్రాంతాలు ముంపుకు గురవుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్రపోతోందని చంద్రబాబు విమర్శించారు. దీనికి వరద సన్నద్ధత ఏదీ అంటూ ఈనాడులో వచ్చిన వార్తను కూడా జత చేశారు.
సాయిరెడ్డి కౌంటర్
చంద్రబాబు ఏం మాట్లాడకపోయినా ఆయన్ను నిత్యం టార్గెట్ చేసే వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆయన ట్వీట్ పెడితే ఊరుకుంటారా, అదీ నేరుగా జగన్ ను టార్గెట్ చేస్తూ పెడితే సైలెంట్ గా ఉంటారా..? ఛాన్సే లేదు. దీంతో సాయిరెడ్డి చంద్రబాబు పెట్టిన ట్వీట్ కు ఘాటు కౌంటర్ ఇచ్చారు. గతాన్ని గుర్తుచేస్తూ చంద్రబాబు అయితే ఏం చేసేవారు, జగన్ అయితే ఏం చేశారు అనేలా సాయిరెడ్డి పెట్టిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. గతంలో చంద్రబాబును గోదావరివరదల సందర్భంగా పలుమార్లు విమర్శించిన సాయిరెడ్డి ఇప్పుడు మరోసారి ఆటాడుకున్నారు.
ఓ రేంజ్ లో ఆడుకున్న సాయిరెడ్డి
చంద్రబాబు ఏపీ వరదలపై ప్రభుత్వం నిద్రపోతోందంటూ పెట్టిన ట్వీట్ కు తనదైన శైలిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కౌంటర్ ఇచ్చారు. "అవునులే చంద్రం నువ్వు సీఎంగా ఉంటే గోదారికి మోకాలడ్డంపెట్టి వరదలను ఆపేసే వాడివి లేదా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర షూటింగ్ చేసి వందమందిని చంపేసేవాడివి.15 కోట్ల లగ్జరీ బస్సు వేసుకొచ్చి సహాయ చర్యలకైనా అడ్డం పడేవాడివి. ఈ డ్రామాలేవీ లేకుండా సాయం అందుతుంటే పచ్చ మీడియాకు కడుపుమంటే" అంటూ సాయిరెడ్డి రెచ్చిపోయారు. దీంతో చంద్రబాబు ట్వీట్ కు ఘాటు కౌంటర్ పడినట్లయింది.