ఏపీ హైకోర్టు తీరుపై రాజ్యసభలో సాయిరెడ్డి ఫైర్.. అసాధారణ, పక్షపాత నిర్ణయాలంటూ వ్యాఖ్య...
ఏపీలో గత ఏడాదిన్నర కాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెలువడుతున్న తీర్పులతో వైసీపీ ప్రభుత్వంలో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఇదే విషయం రెండు రోజులుగా పార్లమెంటులోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా అమరావతి భూముల కుంభకోణంలో ప్రముఖుల పేర్లు ఉన్నందున దీనిపై మీడియాలో వార్తలు ప్రసారం కాకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావిస్తున్నారు.
నిన్న లోక్సభలో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి ఏపీ హైకోర్టు ఆదేశాలను పరోక్షంగా ప్రస్తావించగా.. ఇవాళ రాజ్యసభలో సీనియర్ ఎంపీ, వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి హైకోర్టు తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ హైకోర్టు నిర్ణయాలు అసాధారణంగా, పక్షపాత ధోరణితో ఉంటున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు. ఏపీలో న్యాయవ్యవస్ధ ఎందుకు నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని, ప్రభుత్వంపై పూర్తి వ్యతిరేకత, పక్షపాత ధోరణిని ప్రదర్శిస్తోందని సాయిరెడ్డి నిప్పులు చెరిగారు.

విభజనతో ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు న్యాయవ్యవస్ధ కారణంగా కూడా ఇబ్బందులు ఎదుర్కొంటోందని రాజ్యసభకు విజయసాయిరెడ్డి వివరించారు. ఏపీ హైకోర్టు తాజాగా అమరావతి భూముల విచారణపై మీడియాలో వార్తలు ప్రసారం కాకుండా ఇచ్చిన ఉత్తర్వులు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని సాయిరెడ్డి సభకు తెలిపారు. కేవలం పిటిషనర్ అయిన మాజీ అడ్వకేట్ జనరల్ అడిగారని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడమేంటని సాయిరెడ్డి ప్రశ్నించారు.
Recommended Video
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రసంగాన్ని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్
పదే పదే అడ్డుకున్నా ఆయన మాత్రం పట్టు వీడలేదు. మీరు ప్రసంగం ఆపకపోతే మైక్ వేరే ఎంపీలకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పినా సాయిరెడ్డి పట్టించుకోలేదు. తన ప్రసంగాన్ని సుదీర్ఘంగా కొనసాగించారు. కరోనాను ఎదుర్కోవడంలో ఏపీ తీసుకున్న చర్యలను మాత్రమే ప్రస్తావించాలని చెప్పినా వినలేదు. చివరికి సాయిరెడ్డి తాను చెప్పాలనుకున్నది చెప్పాకే ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications