ఢిల్లీ గడ్డపై జగన్- పార్టీ సెంట్రల్ ఆఫీస్
అధికార వైఎస్ఆర్సీపీ.. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి సన్నద్ధమౌతోంది. దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలంటూ ఆ పార్టీ ఎంపీలు కేంద్రమంత్రిని కలిశారు.
అమరావతి: అధికార టీఆర్ఎస్.. భారత్ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాలపై దృష్టి సారించింది. బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సంకీర్ణ కూటమికి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షాలను కూడగట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం దేశ రాజధానిలోనూ మకాం వేసింది బీఆర్ఎస్. కేంద్ర ఎన్నికల కమిషన్ అధికారులు.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చడానికి అంగీకరించిన అతి కొద్దిరోజుల్లోనే ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించింది కూడా.
ఇప్పుడదే బాటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాగుతున్నట్టే కనిపిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తమౌతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో క్రమంగా- దేశ రాజకీయాలపైనా పట్టు బిగించడానికి ఇప్పటి నుంచే కసరత్తు చేయడానికి తెర తీస్తోందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత- దేశంలోనే నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన వైఎస్ఆర్సీపీ- అదే దూకుడును ఢిల్లీ వేదికగా కూడా కొనసాగించడానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.

ఢిల్లీలో కొత్తగా పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంది వైఎస్ఆర్సీపీ. దీనికి అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఆ పార్టీ లోక్ సభ సభ్యులు ఇవ్వాళ- కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీని కలిశారు. వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించాల్సిన అవసరం గురించి ఆయనకు వివరించారు. భూమిని కేటాయించిన వెంటనే పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వీలైనంత త్వరగా భూమిని కేటాయించాలని కోరారు.
వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నాటికి ఢిల్లీ కేంద్ర కార్యాలయం నుంచే కార్యకలాపాలు సాగించేలా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించుకుంటున్నట్లు చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయిరెడ్డి, లోక్ సభలో పార్టీ సభాపక్ష నాయకుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, తలారి రంగయ్య, డాక్టర్ సత్యప్రభ, డాక్టర్ సంజయ్ కుమార్, ఎంవీవీ సత్యనారాయణ, గోరంట్ల మాధవ్.. కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.












Click it and Unblock the Notifications