'క్లైమాక్స్లో వైసీపీ ఎంపీల రాజీనామా, ఆ యాక్ట్ ప్రకారం ఉప ఎన్నికలు జరగవు'
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామా డ్రామా తుది దశకు చేరుకుందని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలు తప్పించుకోవడంలో వారు విజయం సాధించారన్నారు. రాష్ట్రంలో వైసీపీ, బీజేపీ పతనావస్థకు చేరుకున్నందునే ఉప ఎన్నికలకు భయపడి ఇంత డ్రామా నడిపించారన్నారు.
Recommended Video
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీ అహంభావ రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. భాగస్వామ్య పక్షాలకు ద్రోహం చేసిన బీజేపీ మళ్లీ ఇప్పుడు వాళ్ల చుట్టూ తిరుగుతోందన్నారు. శివసేన వద్దకు అమిత్ షా వెళ్తున్న నేపథ్యంలో యనమల ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చిన తర్వాత తోడు లేకపోతే పుట్టగతులు ఉండవని తెలుసుకున్న బీజేపీ నష్ట నివారణ చర్యలు చేపట్టిందన్నారు.
అందుకే, బీజేపీ ఒంటరిగా మారింది
బీజేపీలో అగ్రనేతలు అద్వానీ, మురళీ మనోహర్ జోషిని అగౌరవపరిచిన అమిత్ షా, మోడీ ప్రజల్లో వ్యతిరేకత చూసి ఇప్పుడు వారి సాయం కోరుతున్నారని యనమల ధ్వజమెత్తారు. తమకు తిరుగులేదంటూ విర్రవీగిన అమిత్ షా, మోడీలు అద్వానీ, జోషి ఇళ్లకు తిరగడం, శివసేన, జెడి(యూ), అకాలీదళ్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తుండటం ఆ పార్టీ ప్రస్తుత దుస్థితికి ప్రతిబింబమన్నారు. నాలుగేళ్ల మోడీ ప్రభుత్వ వైఫల్యాలకు ఇదే ప్రతిబింబమన్నారు. స్వయంకృతం వల్లే దేశంలో బీజేపీ ఒంటరిగా మారిందన్నారు. రాజీనామా డ్రామాలు ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు.
రాజీనామా డ్రామాలు అట్టర్ ప్లాప్
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల రాజీనామాలు అట్టర్ ప్లాప్ అయ్యాయని చిత్తూరు ఎంపి, తెలుగుదేశం పార్టీ నేత శివప్రసాద్ అన్నారు. వైసీపీ ఎంపీల వాళ్ల వాళ్ల పరిధిలో బాగా నటించారన్నారు. వైసీపీ నాటకాలు సాగవను, ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. ఉప ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ గెలవడం ఖాయమన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాడుతోంది టీడీపీనే అన్నారు.
ఆ యాక్ట్ ప్రకారం ఉప ఎన్నికలు జరగవనే
రాజీనామాలపై వైసీపీ ఎంపీలు బాగా నటించి మోసం చేస్తున్నారని శివప్రసాద్ అన్నారు. 1951 యాక్ట్ ప్రకారం ఇప్పుడు రాజీనామాలు ఆమోదించుకుంటే ఎన్నికలు జరగవని తెలిసే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని చెప్పారు.
రాజీనామాలతో ఎలాంటి ప్రయోజనం లేదు
వైసీపీ ఎంపీల రాజీనామాలవల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. జూన్ 4వ తేదీకి ముందే రాజీనామాలను ఆమోదింప చేసుకుని ఉంటే చిత్తశుద్ధి తెలిసేదన్నారు. రాజీనామాలవల్ల హోదా రావాలని, ఉప ఎన్నికలు రావాలని, ఎన్నికలు జరిగితే వారికి ప్రజల్లో ఉన్న సత్తా ఏంటో తెలుస్తుందన్నారు. ఇప్పుడు వారు రాజీనామాలు ఆమోదింప చేసుకున్నా ఉప ఎన్నికలు రావని, వైసీపీ రాజీనామాలంతా ఓ డ్రామా అని తాము ముందు నుంచి చెబుతున్నామన్నారు.
బొత్స సత్యనారాయణ ఆగ్రహం
మరోవైపు, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఏపీలో పరిపాలన వ్యవస్థ గాడి తప్పిందన్నారు. జగన్ అధికారంలో ఉంటేనే ప్రజల కోరికలు తీర్చగలని చెప్పారు. తెలుగుదేశం పార్టీ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. మరో 20 ఏళ్ల పాటు అభివృద్ధికి సంక్లిష్ట పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. టిడిపి నేతలు మట్టి, ఇసుకను యథేచ్చగా దోచేస్తున్నారన్నారు. ఏపీ ప్రభుత్వం పూర్తిగా వినీతిలో కూరుకుపోయిందన్నారు. ఏపీకి టీడీపీ ఎంత నష్టం చేసిందో, బీజేపీ కూడా అంతే నష్టం చేసిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పాలన్నారు. బీజేపీ, వైసీపీ మధ్య ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని తేల్చి చెప్పారు. గ్రామస్థాయిలో టీడీపీ నేతల అవినీతిని విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ కొద్దిపాటి తేడాతో అధికారంలోకి రాలేకపోయిందన్నారు.