ప్రతీ ఇంటా "మా నమ్మకం నువ్వే జగన్"...!!
ఎన్నికలకు సిద్దమవుతున్న వైసీపీ నేతలు కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లటం ప్రారంభించారు.
వై నాట్ 175. రానున్న ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి జగన్ కసరత్తు వేగవంతం చేసారు. 175 సీట్లు గెలవటమే లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలను గడప గడపకు ప్రభుత్వం నిర్వహణలో భాగంగా ప్రతీ ఇంటికి పంపుతున్నారు. అటు పొత్తులతో తన మీద రాజకీయ పోరాటానికి సిద్దమైన ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. ఎవరెన్ని పొత్తులతో తోడేళ్లులాగా వచ్చినా..తాను సింహం లాగా సింగిల్ గానే ఫైట్ చేస్తానని ప్రకటించారు.
ఎవరితోనూ పొత్తులు ఉండవని తేల్చి చెప్పారు. తాను అమలు చేస్తున్న సంక్షేమమే తిరిగి అధికారం దక్కేలా చేస్తుందని ముఖ్యమంత్రి నమ్ముతున్నారు.అందులో భాగంగా వైసీపీ నాయకత్వం మరో నిర్ణయం తీసుకుంది. ప్రతీ ఇంటా సీఎం జగన్ పేరు వినిపించేలా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రతీ ఇంటికి అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్తున్నారు. ప్రభుత్వం నుంచి అందుతున్న లబ్ది గురించి వెళ్తున్న ప్రతీ ఇంటికి వివరిస్తున్నారు. వారికి ఇప్పటి వరకు ఎంత మేర ప్రయోజనం కలిగిందీ వివరించి చెబుతున్నారు. అదే సమయంలో పథకాలు అందన వారి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పథకం అందిస్తామని చెబుతున్నారు. ఇదే సమయంలో పధకాలు అందుతున్న ప్రతీ ఇంటికి"మా నమ్మకం నువ్వే జగన్"స్టిక్కర్లు అతికించాలని నిర్ణయించారు.
కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాటసాని ఈ విధానాన్ని ప్రారంభించారు. పథకాలు అందుతున్న ఇంటికి వెళ్లిన సమయంలో ఆ ఇంటిలోని వాళ్లతో చర్చించి..వాళ్ల అనుమతితో జగన్ స్టిక్కర్ అతికించాలని నిర్దేశించారు. పాణ్యంలో పెద్ద సంఖ్యలో ఇళ్లకు ఈ విధంగా స్టిక్కర్లు కనిపిస్తున్నాయి.
ఇదే విధంగా ఇతర జిల్లాల్లోనూ ఈ కార్యక్రమం ప్రారంభించే అవకాశం కనిపిస్తోంది. దీని ద్వారా ప్రతీ ఇంటా వైసీపీతో ఎమోషనల్ అటాచ్ కొనసాగుతుందని చెబుతున్నారు.ఈ నెలలోనే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ సమావేశాల సమయంలో ఎమ్మెల్యేలతో సీఎం జగన్ ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఇంటింటికి గడప కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేల పని తీరు పైన సీఎం జగన్ ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు తెప్పిస్తున్నారు.
నివేదికల ఆధారంగా సూచనలు చేస్తున్నారు. ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ఖరారు చేస్తానని ఇప్పటికే సీఎం జగన్ ప్రకటించారు. ఇక, నెల్లూరు జిల్లాలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వేళ మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో గెలుపే లక్ష్యంగా ముఖ్యమంత్రి తన లక్ష్యాన్ని స్పష్టం చేయనున్నారు.