ఎన్టీఆర్ విగ్రహానికి ఏ రంగులైనా వేయచ్చు : గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా - పార్టీ ప్లీనరీలో వైసీపీ నేతలు..!!
గుడివాడ గడ్డ కొడాలి నాని అడ్డా అని, దీన్ని ఎవరూ చెక్కు చెదర్చలేరని మంత్రి జోగి రమేష్ చెప్పుకొచ్చారు. గుడివాడలో జరిగిన వైసీపీ ప్లీనరీలో జిల్లా నేతలు పాల్గొని..గుడివాడలో కొడాలి నాని కి ప్రజల్లో ఉన్న బలం గురించి కీలక వ్యాఖ్యలు చేసారు. మరో పాతికేళ్లు జగన్ సీఎంగా ఉంటారని..ఎవరూ ఏం చేయలేరని మంత్రి జోగి ధీమా వ్యక్తం చేసారు. చంద్రబాబు తన దుష్ట చతుష్టయంతో కలిసి వచ్చినా.. కొడాలి నానిని ఓడించలేరని చెప్పుకొచ్చారు.
గుడివాడకు బ్రాండ్ అంబాసిడర్
కొడాలి నానిని టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా 2004కు ముందు మనిషే అనే భ్రమల్లో ఉన్నారని..ఇప్పుడు వేలాడి మంది అభిమానం సొంతం చేసుకున్న వ్యక్తి కొడాలి నాని అని కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు పేర్ని నాని పేర్కొన్నారు. కొడాలి నాని దెబ్బకు చంద్రబాబుకు నిద్ర పట్టటం లేదని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ను దించేస్తా - నానిని ఓడిస్తా అనే స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని ఎద్దేవా చేసారు. కొడాలి నాని గుడివాడకు ఒక బ్రాండ్ అంబాసిడర్ గా మారారన్నారు. కొడాలి నానిని ఓడించటం ఎలా ఉన్నా.. ముందు ఆయన పైన పోటీకి అభ్యర్ధి ఉన్నారో లేదో చూసుకోవాలని పేర్ని నాని సూచించారు.
ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడైనా
ఎంత మంది దిగొచ్చినా కొడాలిని ఏం చేయలేరని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎవరైనా ఎక్కడైనా పెట్టుకోవచ్చంటూ మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఏ రంగు అయినా వేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. చంద్రబాబు గుడివాడ వస్తారు వెళ్తారు..కానీ, ఎప్పటి నుంచో గుడివాడలో తనను ఓడిస్తానని చంద్రబాబు చెబుతూనే ఉన్నారన్నారు. ఎన్టీఆర్ ఏ పార్టీకి చెందిన వారు కాదని పేర్కొన్నారు. టీడీపీకి- ఎన్టీఆర్ కు సంబంధం లేదని ఎన్నికల సంఘానికి లేఖ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
మరోసారి జగన్ సీఎం - కొడాలి ఎమ్మెల్యే
ఎన్టీఆర్ నుంచి పార్టీని లాక్కొని వెన్నుపోటి పొడిచిన వ్యక్తి చంద్రబాబు కాదా అంటూ కొడాలి నాని ప్రశ్నించారు. తనను ఓడించినా..గెలిపించినా అది గుడివాడ ప్రజల చేతిలోనే ఉందన్నారు. చంద్రబాబు వచ్చి గుడివాడలో పోటీ చేసినా కొడాలి నానిదే విజయమని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. కొడాలి నాని మరోసారి ఎమ్మెల్యే..జగన్ మరోసారి సీఎం కావటం ఖాయమని జోస్యం చెప్పారు. రేపు గుడివాడ కేంద్రంగా జరగాల్సిన టీడీపీ మినీ మహానాడు వర్షం కారణంగా వాయిదా పడింది.