ఢిల్లీలో చంద్రబాబు- రఘురామ కీలక ప్రతిపాదన..!!
అమరావతి: ఈ ఏడాది అయిదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ సహా ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరంలల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి ఈసీ కసరత్తు కూడా మొదలు పెట్టనుంది. అదే సమయంలో ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాల లేకపోలేదనే ప్రచారం ఊపందుకుంటోంది. రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ముందస్తు ఎన్నికల అంశంపై తెరమీదికి వచ్చింది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మధ్యంతర ఎన్నికలకు వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ ఏడాది అక్టోబర్ నాటికి అసెంబ్లీని రద్దు చేయాలనే యోచనలో వైఎస్ జగన్ ఉన్నారని తెలుస్తోంది. నిజానికి- షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే వచ్చే ఏడాది సార్వత్రికంతో పాటే ఏపీ అసెంబ్లీకీ ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి భిన్నంగా రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు రావొచ్చని చెబుతున్నారు.

అటు తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కూడా ఇదే రకమైన సంకేతాలను ఇచ్చారు పార్టీ క్యాడర్కు. ఏ క్షణమైన అసెంబ్లీ ఎన్నికలు రావొచ్చని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సన్నద్ధం కావాల్సి ఉంటుందనీ సూచించారు. ముందస్తు ఎన్నికల వైపే వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాల మధ్య చంద్రబాబు హస్తిన పర్యటన చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సాయంత్రం ఆయన ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. రెండు రోజుల పాటు ఆయన ఢిల్లీలో ఉండబోతోన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నాయకులను కలుసుకోనున్నారు. ముందస్తు నేపథ్యంలో పొత్తులపై వారితో చర్చిస్తారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో వైఎస్ఆర్సీపీ- తెలుగుదేశం ఒంటరిగానే రాజకీయాలను సాగిస్తోన్నాయి. బీజేపీ-జనసేన పొత్తులో ఉన్నాయి. వామపక్ష పార్టీలు దాదాపుగా టీడీపీ వెంటే నడుస్తోన్నాయి. చంద్రబాబు మాత్రం బీజేపీ వైపు చూపులు సారించారు. బీజేపీ-జనసేనతో కలిసి అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనాలనేది చంద్రబాబు ఆలోచన. ఇదే అంశాన్ని ఆయన బీజేపీ నేతల వద్ద ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదని అంటోన్నారు.
కాగా- ఢిల్లీలో ల్యాండ్ అయిన చంద్రబాబును నర్సాపురానికి చెందిన వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు కలుసుకున్నారు. ఆయనను సాదరంగా ఆహ్వానించారు. టీడీపీ శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడితో కలిసి రఘురామ- విమానాశ్రయానికి వెళ్లారు. చంద్రబాబును స్వాగతించారు. టీడీపీకే చెందిన గుంటూరు, విజయవాడ లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్, కేశినేని నాని వారి వెంట లేకపోవడం చర్చనీయాంశమౌతోంది.
ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు కీలక ప్రతిపాదనను చంద్రబాబు ముందు ఉంచినట్లు చెబుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున బరిలోకి దిగడానికి ఆసక్తిగా ఉన్నానని చెప్పినట్లు తెలుస్తోంది. నర్సాపురం లేదా మరే లోక్సభ నియోజకవర్గం టికెట్ను అయినా తనకు కేటాయించాలనే ప్రపోజల్స్ను పెట్టారని అంటున్నారు. దీనికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని సమాచారం.












Click it and Unblock the Notifications