అజ్ఞానాంధకారంలో ఆ నేతలు: ఈ సాయంత్రం ఆ పని చేయండి: వీడియోలు పోస్ట్ చేయండి: రఘురామ
అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నాల పట్ల.. రాజకీయ విమర్శలు మరింత చెలరేగుతున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జగన్ సర్కార్తో ఓ మినీ యుద్ధమే సాగిస్తోంది..కొద్దిరోజులుగా. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ తరచూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

రేపు విచారణకు..
అదే సమయంలో- పరీక్షలను రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి విద్యార్థి విభాగం నాయకుడు పొట్లూరి దర్శిత్ ఈ పిటీషన్ను దాఖలు చేశారు. ఏపీ హైకోర్టు దీన్ని విచారణకు స్వీకరించింది. శుక్రవారం విచారణకు రానుంది ఈ పిటీషన్. ఈ పరిణామాల మధ్య తిరుగుబాటు నేతగా ముద్రపడిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం లోక్సభ సభ్య్యుడు రఘురామ కృష్ణంరాజు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పట్లాగే ప్రభుత్వాన్ని దనుమాడారు. వైఎస్ జగన్ తీరును తప్పు పట్టారు.

విచారణకు స్వీకరించడం శుభపరిణామం..
కరోనా వైరస్ ఆవరించి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందంటూ మండిపడ్డారు. పరీక్షలను వాయిదా వేయించాలనే జ్ఞానం ముఖ్యమంత్రికి లేకుండాపోయిందంటూ పరోక్షంగా ఆయన ధ్వజమెత్తారు.
పొట్లూరి దర్శిత్, పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలిసి ఇంటర్మీడియట్ పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించడం శుభపరిణామమని అన్నారు.

జ్ఞానజ్యోతులు వెలిగించండి..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరూ దేవాలయాలు, మసీదులు, చర్చ్లకు వెళ్లే పరిస్థితులు లేవని రఘురామ అన్నారు. ఏపీ హైకోర్టులో తమకు న్యాయం జరిగేలా చేయాలని కోరుతూ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు.. తమ తమ దేవుళ్లను పూజించాలని, జ్ఞానజ్యోతులు వెలిగించాలని విజ్ఞప్తి చేశారు. వాటికి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆయన సూచించారు. ఆయా మతస్తులందరూ తాము నిత్యం పూజించే దేవుళ్లకు ఇంట్లోనే పూజలు చేసి, అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతోన్న కొంతమంది నాయకులకు జ్ఞానం కలిగించేలా ప్రార్థించాలని చెప్పారు.

ఇష్ట దైవాలను ప్రార్థించండి..
లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తనలాంటి మహా నాయకుడే కాపాడాలని భావించే అజ్ఞానంలో కొందరు నాయకులు ఉన్నారని విమర్శించారు. పరీక్షల వాయిదాకు సంబంధించిన పిటీషన్ విచారణకు రానున్న నేపథ్యంలో- విద్యార్థులకు న్యాయం జరగాలని, విద్యార్థులకు మద్దతుగా వారి తల్లిదండ్రులు ముందుకు రావాలని, కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ తమ తమ ఇష్ట దైవాలను ప్రార్థించాలని రఘురామ కృష్ణంరాజు విజ్ఞప్తి చేశారు. కోర్టులో వాదనలు జరిగే సమయంలోనూ ప్రార్థనలను కొనసాగించాలని సూచించారు. తమ పిల్లల ప్రాణాలను కాపాడేలా దేవుళ్లను వేడుకోవాలని అన్నారు.

ఉన్మాద చర్యలకు అడ్డుకట్ట..
కొంతమంది నాయకులు ఉన్మాద చర్యలకు ఏపీ హైకోర్టులో అడ్డుకట్ట పడుతుందనే ధీమాను రఘురామ వ్యక్తం చేశారు. పరీక్షలను రద్దు చేయకపోయినప్పటికీ.. కనీసం 45 రోజులపాటు వాయిదా వేసేలా హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించేలా తాము దేవుళ్లను ప్రార్థిద్దామని చెప్పారు. సహేతుకమైన డిమాండ్, విజ్ఞప్తి కావడం వల్ల అందరు దేవుళ్లు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల వైపే ఉంటారని రఘురామ కృష్ణంరాజు చెప్పారు. ప్రతి విద్యార్థీ.. దేవుళ్లను ప్రార్థిస్తూ వీడియోలను తీసి, తమతమ సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్ట్ చేయాలని రఘురామ కృష్ణంరాజు సూచించారు.












Click it and Unblock the Notifications