సాయిరెడ్డి ప్లాన్ కు రఘురామ గండి ? రేపు సీబీఐ కోర్టులో పిటిషన్-విదేశీ టూర్ అడ్డుకునేందుకే ?
ఏపీలో వైసీపీ వర్సెస్ వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరులో మరో ట్విస్ట్ చోటు చేసుకోబోతోంది. ఇప్పటికే పార్టీ అధినేత కమ్ సీఎం వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన రఘురామ... ఇప్పుడు తాజాగా పార్టీలో ఆయన తర్వాత స్ధానంలో ఉన్న కీలక నేత, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. అదీ ఆయన ప్లాన్ ను చెడగొట్టేలా రేపు సీబీఐ కోర్టులో కీలక పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. ఇందులో సీబీఐ కోర్టు ఏమైనా ప్రతికూల ఆదేశం ఇస్తే మాత్రం సాయిరెడ్డికి కష్టాలు తప్పకపోవచ్చు.
క్లైమాక్స్ లో జగన్, రఘురామ పోరు
ఏపీలో వైసీపీ అధినేత కమ్ సీఎం అయిన వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకుంటూ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న పోరు క్లైమాక్స్ కు చేరుకుంటోంది. జగన్ బెయిల్ రద్దు కోరుతూ సీబీఐ కోర్టులో రఘురామ దాఖలు చేసిన పిటిషన్ విచారణ పూర్తి కాగా.. తీర్పు మాత్రం ఆగస్టు 25కు వాయిదా పడింది. ఆ లోపు రఘురామపై అనర్హత వేటు కోరుతూ లోక్ సభ స్పీకర్ కు వైసీపీ ఇచ్చిన ఫిర్యాదుపై ఆయన వివరణ కూడా కోరారు. దీనికి గడువు ముగిసిన రఘురామ వివరణ ఇచ్చినట్లు కనిపించడం లేదు. దీంతో లోక్ సభ స్పీకర్ రఘురామపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇలా వీరిద్దరి పోరు తుది దశకు చేరుకున్నట్లవుతోంది.
రఘురామ తర్వాత టార్గెట్ సాయిరెడ్డి
ఇప్పటివరకూ సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ, లేఖలు రాస్తూ వస్తున్న రఘురామకృష్ణంరాజు.. ఇప్పుడు ఆ పోరు కాస్తా క్లైమాక్స్ కు చేరడంతో తన తదుపరి టార్గెట్ ను కూడా నిర్ణయించేసుకున్నారు. జగన్ తర్వాత వైసీపీలో కీలక నేతగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డిని రఘురామ లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇప్పటికే ఆయనపై నిత్యం విమర్సలు చేస్తున్న రఘురామ.. తాజాగా మరో అస్త్రాన్ని సంధిస్తానని బహిరంగంగానే ప్రకటించారు. విశాఖ భూకుంభకోణంలో నిందితులతో సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఇప్పటికే సాయిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేసిన రఘురామ.. రేపు మరో అస్త్రం సంధించేందుకు సిద్ధమయ్యారు.
సాయిరెడ్డి బెయిల్ రద్దుకు పిటిషన్
సీబీఐ కోర్టులో జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేయడం ద్వారా తనకు కావాల్సినంత ప్రచారం సంపాదించుకోవడంతో పాటు వైసీపీ సర్కార్ ను టార్గెట్ చేసిన రఘురామరాజు ఇప్పుడు విజయసాయిరెడ్డి బెయిల్ కూడా రద్దు చేయాలని సీబీఐ కోర్టును ఆశ్రయించబోతున్నారు. గతంలో విజయసాయిరెడ్డికి బెయిల్ ఇచ్చిన సందర్భంగా సీబీఐ కోర్టు విధించిన షరతులను ఆయన ఎలా ఉల్లంఘిస్తున్నారో ఆధారాలతో సహా రేపు పిటిషన్ వేయబోతున్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వంలో తన పరపతిని వాడుకుంటూ ఆయన ఎలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో కూడా రఘురామ వివరించబోతున్నారు.
సాయిరెడ్డి ఫారిన్ టూర్ ఆపేందుకే ?
జగన్ అక్రమాస్తుల కేసులో ఏ 2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి గతంలో సీబీఐ కోర్టు బెయిల్ షరతుల్లో భాగంగా దేశం విడిచి వెళ్లరాదని ఆదేశించింది. దీంతో ఆయన ఇంతకాలంగా విదేశీ పర్యటనలు చేసేందుకు వీల్లేకుండా పోయింది. కానీ ఇప్పుడు ఆయన ఇండోనేషియా, మలేషియా పర్యటనలకు వెళ్లేందుకు సిద్దమవుతున్నారు.ఇందుకోసం బెయిల్ షరతుల్ని సడలించాలని సీబీఐ కోర్టులో పిటిషన్ వేశారు. ఇది విచారణకు రావాల్సి ఉంది. సీబీఐ కోర్టు అనుమతిస్తే సాయిరెడ్డి ఆగస్టు
19 తర్వాత విదేశీ టూర్ కు వెళ్లనున్నారు. ఇప్పుడు దీన్ని అడ్డుకోవడమే లక్ష్యంగా రఘురామరాజు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సాయిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ లో ప్రస్తావించే అంశాల్ని సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంటే మాత్రం విదేశీ టూర్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చు.