వైసీపీలో బిగ్ వికెట్ డౌన్
రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల మధ్య సార్వత్రిక ఎన్నికల సమరం నువ్వా?నేనా? అన్నరీతిలో జరుగుతోంది. అన్ని పార్టీల్లోను ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జోరుగా చేరికలు జరుగుతున్నాయి. తాజాగా గురజాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాలను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ కు పంపించారు. తెలుగుదేశం పార్టీలో చేరాలనే నిర్ణయాన్ని ఆయన ఇటీవలే తీసుకున్నారు.
చంద్రబాబును కలిసి చర్చించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తామనే హామీ రావడంతో పార్టీ మారబోతున్నారు. జంగాతోపాటు ఆయన అనుచరులు కూడా వైసీపీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో జంగా పార్టీలో చేరనున్నారు. పల్నాడులో జరిగే ఓ కార్యక్రమంలో జంగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జంగా కృష్ణమూర్తి కీలక నేతగా వ్యవహరించారు. దివంగత వైఎస్ ప్రధాన అనుచరుడిగా ముద్రపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా పనిచేసిన జంగా ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి గురజాల సీటు ఆశించారు. హామీ రాకపోవడంతో పార్టీ మారాలనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రత్యక్ష ఎన్నికలకు వరుసగా రెండుసార్లు దూరంగా ఉండటంవల్ల నియోజకవర్గంలో పట్టు చేజారుతుందని, భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని జంగా భావిస్తున్నారు.
టీడీపీ తరఫున గురజాల నుంచి సీటు ఆశించినప్పటికీ అక్కడే పార్టీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు ఉండటంతో హామీ రాకపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం జరుగుతుందని చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఆయన పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్ విన్యాసాలు జరుగుతుండటంతో వాటిని ప్రజలు ఆసక్తిగా తిలకిస్తున్నారు.












Click it and Unblock the Notifications