వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్ - హత్య కేసులో రిమాండ్..!!
వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు) ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. తూర్పు గోదావరి జిల్లాలో తన డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో అనంతబాబు ప్రధాన నిందితుడుగా ఉన్నారు. డ్రైవర్ ను హత్య చేసి తన కారులోనే డెడ్ బాడీని సుబ్రమణ్యం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఎమ్మెల్సీ అనంతబాబును అరెస్ట్ చేయాలని..శిక్షించాలని డిమాండ్లు వినిపించాయి. సుబ్రమణ్యం కుటుంబ సభ్యులతో పాటుగా దళిత సంఘాల నేతలు సైతం ఆందోళనకు దిగాయి.
దీంతో..ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం ఈ కేసు విషయం లో ఎవరున్న వదలద్దని పోలీసు శాఖను ఆదేశించింది. ఈ కేసును విచారించిన పోలీసులు ఎమ్మెల్సీని అదుపులోకి తీసుకొని కేసు గురించి ఆరా తీసారు. తాను డ్రైవర్ ను చంపినట్లుగా అనంతబాబు అంగీకరించారు. దీంతో, ఆయన్ను అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. ఇక, ఎమ్మెల్సీ ని ఎందుకు భర్తరఫ్ చేయరంటూ రాజకీయంగా ప్రశ్నలు మొదలయ్యాయి. కొన్ని రాజకీయ పార్టీల నేతలు.. తాజాగా కోనసీమ లో చోటు చేసుకున్న పరిణామాలకు ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారానికి ముడిపెట్టి ఆరోపణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వైసీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
ముఖ్యమంత్రి ..పార్టీ అధినేత జగన్ ఆదేశాల మేరకు ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు. ఈ కేసులో పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది. తూర్పు గోదావరిలో వరుసగా జరుగుతున్న పరిణామాలతో తాజాగా, అనంతబాబు సస్పెన్షన్ సైతం చర్చలో చేరింది. అదే విధంగా...కోనసీమ అల్లర్ల వెనుక కారకుల విషయంలోనూ కఠినంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. విధ్వంసానికి పాల్పడిన వారిని వదిలేది తేల్చి చెబుతోంది. ఇప్పటికే అమలాపురంలో పలువురు సీనియర్ పోలీసు అధికారులు మకాం వేసారు. పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉంది. అయినా, ముందస్తు జాగ్రత్తగా బలగాలను మొహరించారు.