టీటీడీ బోర్డు సభ్యుడికి హాట్ ఎంపీ సీట్ ఆఫర్: బీసీ అభ్యర్థి ఖాయం: టీడీపీకి జగన్ చెక్
YS Jagan: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొత్తగా 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చడం, కొత్తవారికి బాధ్యతలను అప్పగించడం.. రాష్ట్ర రాజకీయాలను హీటెక్కించింది. ఇంకో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న ప్రస్తుత పరిస్థితుల్లో చోటు చేసుకున్న ఈ మార్పు మున్మందు మరిన్ని సంచలనాలను తెర తీయడం ఖాయంగా కనిపిస్తోంది.
పనితీరు ఆశించిన స్థాయిలో లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకోవడం లేదా వారిని వేరే నియోజకవర్గాలకు పంపించాలంటూ వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం నిర్ణయించినందున మున్ముందు మరిన్ని మార్పులు ఉండబోతోన్నాయి. ఈ పరిణామాలతో రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరిగింది.

అసెంబ్లీ నియోజకవర్గాల మార్పుపై మరో జాబితా సిద్ధమౌతోంది. ఇద్దరు ఎంపీలు, ఓ మంత్రికి పేరు ఇందులో ఉన్నట్లు చెబుతున్నారు. రాజ్యసభకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మాజీ ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి లోక్సభ సభ్యుడు మార్గాని భరత్ను ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల బరిలో దించుతారని సమాచారం.
పిల్లి సుభాష్ చంద్రబోస్కు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రామచంద్రాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నియమిస్తారని అంటున్నారు. లోక్సభ సభ్యుడు మార్గాని భరత్ను రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీగా నియమించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులును మండపేట నుంచి పోటీ చేయిస్తారని సమాచారం.
అదే క్రమంలో- విజయవాడ లోక్సభ స్థానానికి వెనుకబడిన సామాజిక వర్గ నాయకుడి పేరును వైఎస్ఆర్సీపీ ఖరారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ సైతం బీసీ నాయకుడినే తప్పనిసరిగా బరిలోకి దింపేలా వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులను కదిపినట్టయింది.
ప్రస్తుతం ఈ నియోజకవర్గం- రాష్ట్ర రాజకీయాల్లో హాట్ డిబేట్గా మారిన విషయం తెలిసిందే. కేశినేని చిన్నికి టికెట్ ఇవ్వాలని టీడీపీ నిర్ణయించుకున్నప్పటికీ.. వైఎస్ జగన్ వేసిన ఎత్తులకు తన నిర్ణయాలను మార్చుకోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటోంది. విజయవాడ నుంచి బీసీ అభ్యర్థిని పోటీకి దింపితే తానే దగ్గరుండి ఓడిస్తానంటూ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని హెచ్చరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ పారిశ్రామికవేత్త నెరుసు నాగ సత్యం పేరును వైఎస్ఆర్సీపీ పరిశీలిస్తోన్నట్లు చెబుతున్నారు. ఆయన పేరును దాదాపు ఖరారు చేసిందని అంటున్నారు. ప్రస్తుతం నాగసత్యం.. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా ఉంటోన్నారు. గతంలో ఆయన ఒలెక్ట్రా గ్రీన్టెక్ హోల్టైమ్ డైరెక్టర్గా పని చేశారు.












Click it and Unblock the Notifications