పులివెందుల నుంచి సునీత - జగన్ స్థానం మార్పు: పొలిటికల్ మైండ్ గేమ్ - ఏం జరుగుతోంది..!!
సీఎం జగన్ తన నియోజకవర్గం మారుతున్నారా. వైఎస్సార్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందుల నుంచి ఈ సారి పోటీ చేయటం లేదా. కొద్ది రోజులుగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఈ ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తాజాగా.. వైసీపీ ప్లీనరీ వేదికగా పార్టీ గౌరవాధ్యక్ష పదవికి విజయమ్మ రాజీనామాతో మరో కొత్త చర్చ రాజకీయ మైండ్ గేమ్ లో భాగంగా తెర మీదకు వచ్చింది. ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే గా ఉన్న సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో ఆ సీటును తన సోదరి..వైఎస్ వివేకా కుమార్తె అయిన సునీతకు కేటాయిస్తారని ఈ ప్రచార సారాంశం. జగన్ రానున్న ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తారని ప్రచారం సాగుతోంది.
పులివెందుల నుంచి బరిలో ఎవరు
పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా.. కడప నుంచి నాలుగు సార్లు ఎంపీగా పని చేసారు. వైఎస్సార్ మరణం తరువాత విజయమ్మ పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక, 2014, 2019 ఎన్నికల్లో జగన్ అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ, వివేకా హత్య తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో భాగంగా ఇప్పుడు ఆ సీటును సునీతకు ఇస్తున్నారంటూ ప్రచారం మొదలైంది.
వివేకా హత్య కేసులో న్యాయం జరగటం లేదనే అభిప్రాయంతో సునీత ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే వివేకా హత్య కేసును సీబీఐ విచారిస్తోంది. ఇక, షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ .. విజయమ్మ.. పార్టీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా తో ఇప్పుడు సునీత విషయంలో వైసీపీ పులివెందుల నుంచి పోటీ చేయించే ఆలోచనలో ఉందంటూ ప్రచారం మొదలైంది.
విజయమ్మ రాజీనామాతో
కొద్ది కాలం క్రితం టీడీపీ అధినేత చంద్రబాబు తమ పార్టీ నుంచి కడప ఎంపీ లేదా పులివెందుల నుంచి పోటీ చేయాలంటూ సునీత - ఆమె భర్తకు ఆఫర్ చేసారంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే, సునీత తనకు రాజకీయాల పైన ఆసక్తి లేదని ఖరాఖండిగా చెప్పినట్లుగా అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఇప్పుడు వైసీపీ నుంచి ఆఫర్ ఇస్తున్నట్లుగా కొత్త ప్రచారం మొదలైంది.
అయితే, వైసీపీ ముఖ్య నేతలు ఈ ప్రచారాన్ని కొట్టి పారేస్తున్నారు. అసలు అటువంటి ప్రతిపాదన ఏదీ లేదని చెబుతున్నారు. సునీత ప్రముఖ ఆస్పత్రిలో డాక్టర్ గా సేవలు అందిస్తున్నారని..రాజకీయ రంగంలో ప్రవేశించే అవకాశం లేదనేది వారి వాదన. ఇదంతా.. ప్రతిపక్షాల మైండ్ గేమ్ గా వైసీపీ నేతలు అభివర్ణిస్తున్నారు. కానీ, విజయమ్మ నిర్ణయం తరువాత ప్రతిపక్ష పార్టీలు సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలకు పదును పెట్టారు.
సీఎం జగన్ క్లారిటీ ఇవ్వబోతున్నారా
నాడు షర్మిల..నేడు విజయమ్మ అంటూ కార్నర్ చేస్తున్నారు. నాడు తన రాజకీయ అవసరాల కోసం తల్లి - చెల్లి ఇద్దిరనీ ప్రచారానికి వాడుకొని..ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత పక్కన పెట్టేసారంటూ ఆరోపిస్తున్నారు. దీనికి వైసీపీ నేతలు స్పందిస్తున్నారు. విజయమ్మ తన నిర్ణయం వెనుక కారణాలను ప్లీనరీ వేదికగా స్పష్టంగా చెప్పారని.. ఇందులో సందేహాలకు - అనుమానాలకు అవకాశమే లేదని చెబుతున్నారు.
దీంతో.. ఇప్పుడు సీఎం జగన్ తన తల్లి- చెల్లి నిర్ణయాల విషయంలో తనను టార్గెట్ చేస్తున్న ప్రతిపక్షాలకు ఏ రకంగా సమాధానం చెప్పబోతున్నారనేది ఉత్కంఠగా మారుతోంది. అందుకు ప్లీనరీ ప్రసంగాన్ని వేదికగా చేసుకుంటారా లేక, అసలు ఈ విమర్శల ను పట్టించుకోకుండా వదిలేస్తారా అనేది చూడాలి.