ఆయన మాట.. దైవాజ్ఞ: టికెట్ దక్కకపోవడంపై స్పందించిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో 68 లోక్సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
నాలుగో విడతలో ఒక లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఇన్ఛార్జీలను నియమించింది వైసీపీ. ఉప ముఖ్యమంత్రి కే నారాయణ స్వామిని చిత్తూరు లోక్సభ స్థానానికి ఇన్ఛార్జ్గా నియమించింది. ఆయన ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న గంగాధర నెల్లూరు నియోజకవర్గానికి రెడ్డప్పను అపాయింట్ చేశారు.

శింగనమల- ఎం వీరాంజనేయులు, తిరువూరు- నల్లగట్ల స్వామిదాస్, మడకశిర- ఈర లక్కప్ప, కొవ్వూరు- తలారి వెంకట్రావ్, కనిగిరి- దద్దాళ నారాయణ యాదవ్, గోపాలపురం- తానేటి వనిత, నందికొట్కూరు- డాక్టర్ సుధీర్ దారా నియమితులయ్యారు.
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంపై వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతోంది. యువ నాయకురాలు జొన్నలగడ్డ పద్మావతి.. ఈ స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. 2019 నాటి ఎన్నికల్లో 46 వేలకు పైగా భారీ మెజారిటీతో టీడీపీకి చెందిన బండారు శ్రావణిని మట్టికరిపించారు.
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ దక్కట్లేదు. పద్మావతికి బదులుగా స్థానిక నాయకుడు ఎం వీరాంజనేయులును ఇన్ఛార్జీగా నియమించింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. మాదిగ సామాజిక వర్గానికి చెందిన నాయకుడాయన. పద్మావతికి ప్రధాన అనుచరుడిగా పేరుంది.

తనకు టికెట్ దక్కకపోవడంపై పద్మావతి స్పందించారు. సామాజిక సమీకరణలో భాగంగా ఎం వీరాంజనేయులును పార్టీ నాయకత్వం ఇన్ఛార్జీగా నియమించిందని పేర్కొన్నారు. వైఎస్ జగన్ను దాదాపు దశాబ్ద కాలంగా దగ్గరగా పరిశీలించానని, ఎన్ని కష్టనష్టాలకు ఓర్చి అయినా బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలన్నది ఆయన తపన అని వ్యాఖ్యానించారు.
అదే కమిట్మెంట్ సామాజిక న్యాయంలోనూ కనిపిస్తోందని పద్మావతి వ్యాఖ్యానించారు. మెజారిటీ వర్గానికి ప్రాతినిథ్యాన్ని కల్పించాలనే జగన్ భావజాలానికి కట్టుబడి, ఆయన మాట దైవాజ్ఞగా భావిస్తోన్నానని, కొత్త ఇన్ఛార్జీ వీరాంజనేయులుకు సంపూర్ణ సహకారాలు అందిస్తామని తేల్చి చెప్పారు. శింగనమల నియోజకవర్గ అభివృద్ధి, జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడం తమ లక్ష్యాలని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications