భగ్గుమంటున్న వైసీపీ.. అక్కడ కూడా వైఎస్ఆర్ పేరు తొలగింపు !
ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. వైఎస్ఆర్ పేరును తొలగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు తీవ్రవివాదాస్పదంగా మారుతున్నాయి. ఇటీవల ఏపీ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లా పేరును.. వైఎస్ఆర్ కడప జిల్లాగా మారుస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. అలానే కృష్ణా జిల్లాలోని వైఎస్ఆర్ తాడిగడప మున్సిపాలిటీ పేరును.. తాడిగడప మున్సిపాలిటిగా మార్చారు. ఈ రెండు వ్యవహరాల విషయంలోనే వైసీపీ, కూటమి శ్రేణుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏకంగా మరోచోట వైఎస్ఆర్ పేరును తొలగించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విశాఖపట్నం స్టేడియం పేరు మార్పు..
విశాఖపట్నంలోని వైఎస్ఆర్ ఏసీఏ - వీడీసీఏ స్టేడియం పేరును ఏసీఏ- వీడీసీఏ స్టేడియంగా మార్చినట్లు వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. రాత్రికి రాత్రే బోర్డులను సైతం మార్చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా వైజాగ్ ఫిల్మ్ నగర్ క్లబ్లోని గార్డెన్ కు ఉన్న వైఎస్ఆర్ పేరును కూడా గతంలో తొలగించారని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ పేరు విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వైసీపీ నేతలు ఫైర్ అవుతున్నారు.

ధర్నాకు పిలుపునిచ్చిన గుడివాడ అమర్నాథ్..
ఏపీలో కూటమి సర్కార్ కక్ష సాధింపులు పీక్ స్టేజ్కు చేరుకున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. వైఎస్ఆర్ పేరును గోడల మీద, స్టేడియం మీద చెరిస్తారేమో కానీ ప్రజల గుండెల్ మాత్రం చెరపలేరని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కక్ష్య పూరిత చర్యలకు నిరసనగా గురువారం ఉదయం 10 గంటలకి స్టేడియం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు వెల్లడించారు. మహానేత పేరు వింటేనే కూటమి నేతలకు వెన్నులో వణుకు పుడుతోందని అన్నారు.
మరోవైపు కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో విధ్వంసం పెరిగిపోయిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు అన్నారు. కోడుమూరులో, నాగార్జున యూనివర్సిటీలో వైఎస్ విగ్రహాన్ని ధ్వంసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా కవ్వింపు చర్యలు మానుకోవాలని.. పేరును తొలగించవచ్చు కానీ మహానేతపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని చెరపలేరని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications