సోనియాతో షర్మిల భేటీ, పార్టీ విలీనం - ఏపీలో కీ రోల్, కడప బరిలో..!!
వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు రంగం సిద్దమైంది. కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీతో ఢిల్లీలో షర్మిల భేటీ కానున్నారు. పార్టీ విలీనం..భవిష్యత్ బాధ్యతలపైన ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. సోనియాతో చర్చలు.. పార్టీ విలీనం లాంఛనమే. ఏపీలో షర్మిల సేవలను వినిగియోంచుకోవాలనే పార్టీ ఆలోచనకు అనేక తర్జన భర్జనల తరువాత షర్మిల అంగీకరించారు. ఏపీ నుంచే షర్మిల పోటీ చేయనున్నట్లు సమాచారం.
నేడు సోనియాతో భేటీ :వైఎస్ షర్మిల కాంగ్రెస్ లో ఎంట్రీ అధికారికం కానుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న షర్మిల ఈ రోజు సోనియాతో భేటీ కానున్నారు. తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం..పార్టీలో తన పాత్ర...బాధ్యతల పైన పార్టీ ముఖ్య నేతల తో పలు దఫాలు చర్చలు చేసారు. షర్మిలను పార్టీలోకి ఆహ్వానం..విలీనం పైన కాంగ్రెస్ ముఖ్య నేతలు డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్ చర్చలు చేసారు. తెలంగాణకే తాను పరిమితం అవుతానంటూ తొలి నుంచి షర్మిల చెబుతూ వచ్చారు. కానీ, టీపీసీసీ చీఫ్ రేవంత్ తో సహా పలువురు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు. వైఎస్సార్ తో కలిసి పని చేసిన కాంగ్రెస్ నేతలు షర్మిలకు మద్దతుగా నిలిచారు. తెలంగాణ ఎన్నికల వేళ మరింత ఆలస్యం చేయకుండా ముందుగా షర్మిలను పార్టీలో చేర్చుకోవాలని..రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలను వినియోగించుకోవాలని పార్టీ డిసైడ్ అయింది.

ప్రతిపాదనలకు అంగీకారం:ఇదే ప్రతిపాదనకు షర్మిల సైతం అంగీకరించినట్లు సమాచారం. ఈ రోజు సోనియాతో సమావేశం సమయంలో ఏపీలోనూ షర్మిల పార్టీ బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెలంగాణలో ఎన్నికల వరకు ప్రచారంలో షర్మిల భాగస్వామి కానున్నారు. పాలేరు నుంచి పోటీ చేయాలని షర్మిల కోరుకున్నా, కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపేందుకు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు షర్మిల అంగీకరించారని చెబుతున్నారు.
దీంతో, ఈ రోజు సోనియాతో జరిగే సమావేశానికి తన భర్త అనిల్ తో కలిసి షర్మిల హాజరు కానున్నారు. సెప్టెంబర్ 2న వైఎస్సార్ వర్దంతి నాడు షర్మిల తన భవిష్యత్ రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ తో కొనసాగింపు..లక్ష్యాలను అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. రాహుల్ ను ప్రధాని చేయాలనే తన తండ్రి లక్ష్యం మేరకు తాను పని చేస్తానని షర్మిల చెప్పనున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో కీలక బాధ్యతలు:ఇక, తెలంగాణ ఎన్నికలు పూర్తవుతూనే ఏపీలో ఫోకస్ చేసేలా ఇప్పటికే షర్మిలతో కాంగ్రెస్ నాయకత్వం చర్చలు చేసింది. పార్టీ తరపున ఏపీలో ప్రచారానికి షర్మిల అంగీకరించారని సమాచారం. ఇదే సమయం లో ఆంధ్రప్రదేశ్లో పార్టీ బాధ్యతలు షర్మిలకు అప్పగించేందుకు సిద్దమైంది. దీని ద్వారా ఏపీలో సీఎం జగన్..ఆయన ఓట్ బ్యాంక్ లక్ష్యంగా ఏపీలో షర్మిల సేవలను కాంగ్రెస్ వినియోగించుకోవాలని భావిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో అన్నీ అనుకూలిస్తే కడప లోక్ సభ బరిలో కాంగ్రెస్ అభ్యర్ధిగా షర్మిలను దించాలనేది కాంగ్రెస్ ఆలోచనగా విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ సంప్రదాయ ఓట్ బ్యాంక్ జగన్ వైపు టర్న్ అయింది. ఇప్పుడు. అయితే, ఏపీలో షర్మిల కాంగ్రెస్ నేతగా బాధ్యతలు స్వీకరిస్తే ఎన్నికల వేళ రాష్ట్రంలో రాజకీయం మరింత ఆసక్తి కరంగా మారే అవకాశం ఉంది. మరి..ఈ ప్రతిపాదనలకు షర్మిల పూర్తి స్థాయి ఆమోదం తెలుపుతారా..ఏపీలో షర్మిల రోల్ ఏంటనేది సెప్టెంబర్ 2న అధికారికంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications