నీలం సాహ్నీ బ్రాండ్ సంచలనం: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ముహూర్తం అప్పుడే ఫిక్స్
అమరావతి: ఏపీలో మరో ఎన్నికల సంగ్రామానికి తెర లేవబోతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు వరుస బెట్టిన ముగిసిన ప్రస్తుత పరిస్థితుల్లో ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోరాటానికి నగరా మోగబోతోంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్లు సమాచారం. రాష్ట్ర కొత్త ఎన్నికల కమిషనర్గా నీలం సాహ్నీ గురువారం బాధ్యతలను స్వీకరించబోతోన్నారు. ఆ వెంటనే- ఆమె జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ లేదా షెడ్యూల్ను విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
శ్రీవారి భక్తులకు బిగ్ షాక్: టీటీడీ కీలక నిర్ణయం: ఆ టోకెన్లు తగ్గింపు: ఆర్జిత సేవలపైనా
ఎస్ఈసీగా నీలం సాహ్నీ బాధ్యతలు స్వీకరణ రేపే..
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం బుధవారం నాటితో ముగిసింది. ఈ హోదాలో ఆయన అయిదేళ్ల పాటు పనిచేశారు. 2016లో అప్పటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో ఎస్ఈసీగా నియమితులైన ఆయన అయిదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ముగియడం వల్ల ఖాళీ కానున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్థానాన్ని నీలం సాహ్నీ భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన ఆమె గత ఏడాది డిసెంబర్లో పదవీ విరమణ చేశారు. జగన్ సర్కార్ చేసిన సిఫారసుల మేరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమెను తదుపరి ఎస్ఈసీగా నియమించారు.
అదొక్కటే పెండింగ్..
ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ చివరి మూడు నెలల కాలంలో పంచాయతీ, మున్సపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ముగిశాయి. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఒక్కటే మిగిలి ఉంది. వాటిల్లో ప్రజా ప్రతినిధుల పాలన ఆరంభం కావాల్సి ఉంది. దీనిపై ఏపీ హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తన పదవీకాలం ముగిసేలోగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పరిణామాల మధ్య కొత్త ఎస్ఈసీ నీలం సాహ్నీ సారథ్యంలోనే వాటి ఎన్నికల నిర్వహణ ఉంటుందంటూ ఇదివరకు వార్తలొచ్చాయి.
తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్ తరువాతే అనుకున్నా..
తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ రోజైన ఏప్రిల్ 17వ తేదీ తరువాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయ్యే అవకాశాలు ఉన్నాయని, ఈలోగా నీలం సాహ్నీ.. తన కొత్త బాధ్యతలపై అవగాహన ఏర్పడుతుందని అధికార వర్గాలు చెబుతూ వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం.. నీలం సాహ్నీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా బాధ్యతలను స్వీకరించిన వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ఆరంభిస్తారని అంటున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ లేదా షెడ్యూల్ గురువారం నాడే వెలువడుతుందని చెబుతున్నారు.
వీలైనంత త్వరగా
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారి కావడం వల్ల నీలం సాహ్నీకి ఎన్నికల నిర్వహణపై పట్టు ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 8వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారని, 10వ తేదీన ఓట్ల లెక్కింపు ఉండొచ్చనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో అన్ని రకాలుగా అనుకూల వాతావరణం ఉన్నందున జాప్యం చేయకుండా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణను పూర్తి చేయాలని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టుదలతో ఉన్నారని చెబుతున్నారు. పంచాయతీ, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల్లో వెలువడిన ఫలితాలే ఇక్కడా ఉంటాయని ఆశిస్తున్నారు. వీలైనంత వేగంగా ఆ ఎన్నికల ప్రక్రియను కూడా ముగించడానికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.