అద్దెకు ఉంటున్న వారి టార్చర్ తట్టుకోలేక ఇంటి ఓనర్ ఆత్మహత్య, గుండెపోటుతో తల్లి!
బెంగళూరు/హాసన్: ఇంట్లో అద్దెకు ఉన్నవారిని ఇంటి యజమానులు వేధింపులకు గురిచేయడం మనం నిత్యం వింటూనే ఉంటాం. కానీ, ఇక్కడ అద్దెకు ఉంటున్న వారి వేధింపులకు విసిగి ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటి యజమాని మరణవార్త విని ఆమె తల్లి కూడా గుండెపోటుతో మరణించింది.ఇంట్లో లీజ్ కు ఉంటున్న వారి వేధింపులకు విసుగు చెందిన ఇంటి యజమాని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కర్ణాటకలోని హసన్ లో జరిగింది.
హాసన్ సమీపంలోని దసరాకొప్పల్లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. ఇంటి యజమాని అయిన తన కుమార్తె మరణ వార్త విని ఆమె తల్లి కూడా మరణించింది. ఇంట్లో లీజ్ కు ఉంటున్న వారి వేధింపులతో విసిగి వేసారిన ఇంటి యజమాని లలిత (55) రెండు రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తె మరణవార్త విని లలిత తల్లి లక్నమ్మ(75) షాక్కు గురై మృతి చెందిందని పోలీసులు అన్నారు.

దసరాకొప్పల్లో సొంత ఇల్లు ఉన్న లలితమ్మ, ఆమె భర్త నాగరాజ్లు ఇంటి పైనున్న ఇళ్లను అద్దెకు ఇచ్చారు. ఇందులో కొన్ని ఇళ్లను అద్దెకు, కొన్ని ఇండ్లను లీజ్ కు ఇచ్చారు. ఉద్దూరు కొప్పలు గ్రామానికి చెందిన సుధారాణి, నటరాజు దంపతులకు ఇంటి యజమాని లలిత రెండేళ్ల క్రితం రూ. 5 లక్షలకు లీజుకు ఇచ్చారు. నైస్ గా ఇల్లు లీజ్ కు తీసుకున్న సుధారాణి, నటరాజ్ దంపతులు తరువాత ఇంటి యజమాని లలితతో గొడవ పడేవారు.
సుధారాణి, నటరాజ దంపంతులు రానురాను రెచ్చిపోయారు. ఇంటి యజమానులు అయిన నాగరాజు, లలిత దంపతులపై దాడి చేయబోయారు. ఆ సమయంలో ఇరుగుపొరుగు వారు అడ్డుకున్నారు. ఈనెల 16వ తేదీన అద్దెకు ఉంటున్న సుధారాణి ఆమె ఇంటి యజమాని లలితతో గొడవకు దిగి అందరి ముందు ఆమెను బూతులు తిట్టింది. విసిగిపోయిన లలిత ఇంటి నుంచి వెళ్లిపోయారు.
జూన్ 17వ తేదీ ఉదయం నంజదేవరకవలు గ్రామంలోని తన పొలంలో లలిత పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. వెంటనే నాగరాజు ఆయన భార్య లలితను హాసన్ నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే చికిత్స అందక జూన్ 20వ తేదీ రాత్రి లలిత మృతి చెందింది. కుమార్తె లలిత ఆత్మహత్య చేసుకుందని తెలుసుకున్న ఆమె తల్లి లక్షమ్మ గుండెపోటుతో బుధవారం రాత్రి కన్నుమూశారు. ఈ ఘటనపై హసన్ రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications