Bharat NCAP 2.0: కార్లకు ఇక చుక్కలే.. 5-స్టార్ రావాలంటే ఇవి తప్పనిసరి!
Bharat NCAP 2.0: కేంద్ర సర్కారు భారత్ NCAP రెండో విడత అమలుకు వేగంగా అడుగులు వేస్తోంది. 'భారత్ NCAP 2.0' పేరుతో రానున్న ఈ కొత్త సేఫ్టీ ప్రోగ్రామ్ అక్టోబర్ 2027 నుంచి అమల్లోకి రానుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ 66వ వార్షిక సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. ఈ నూతన విధానంలో కేవలం కారులో ప్రయాణించే వారి రక్షణ మాత్రమే కాకుండా రోడ్డుపై నడిచే కాలినడక ప్రయాణీకుల(పెడెస్ట్రియన్స్) రక్షణకు కూడా పెద్దపీట వేయనున్నారు.
మూడు ప్రధాన విభాగాలు.. 100 పాయింట్ల కొత్త నిర్మాణం
'భారత్ NCAP 2.0' ప్రకారం వాహనాల భద్రతా పరీక్షలు ప్రధానంగా మూడు పెద్ద అంశాలపై ఆధారపడి ఉంటాయి. అవి ప్రమాదాలను నివారించే సాంకేతికత, పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్(కాలినడక ప్రయాణీకులు, సైక్లిస్టుల భద్రత), ప్రమాదం జరిగిన తర్వాత ప్రయాణీకులను కాపాడే అత్యవసర సౌకర్యాలు. రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన నూతన AIS-197 నిబంధనల ప్రకారం కార్లకు మొత్తం 100 పాయింట్లలో స్కోరింగ్ ఇస్తారు. ఇందులో క్రాష్ ప్రొటెక్షన్ కు 55 పాయింట్లు, పెడెస్ట్రియన్ సేఫ్టీకి 20 పాయింట్లు, సేఫ్ డ్రైవింగ్ ఫీచర్లకు 10 పాయింట్లు, క్రాష్ అవాయిడెన్స్ కు 10 పాయింట్లు, పోస్ట్-క్రాష్ సేఫ్టీకి 5 పాయింట్లు కేటాయించారు.

5-స్టార్ రేటింగ్ సాధించడం ఇకపై చాలా కష్టం!
నూతన నిబంధనల ప్రకారం కార్లకు అత్యున్నత 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ సాధించడం చాలా సవాలుతో కూడుకున్నదిగా మారనుంది. అక్టోబర్ 2027 నుంచి ఏ కారైనా 5-స్టార్ రేటింగ్ పొందాలంటే 100 పాయింట్లకు గానూ కనీసం 70 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. ఈ పరిమితిని 2029 నాటికి 80 పాయింట్లకు పెంచనున్నారు. దీనికి తోడు కనీస స్టార్ రేటింగ్ అర్హత సాధించాలన్నా సరే.. కారులోని అన్ని వేరియంట్లలోనూ 'కర్టెన్ ఎయిర్ బ్యాగ్స్', ఎలక్ట్రానికి స్టెబిలిటీ కంట్రోల్ ఫీచర్లు ప్రామాణికంగా ఉండటం తప్పనిసరి.
మరింత కఠినమైన క్రాష్ టెస్టులు
ప్రస్తుతం నిర్వహిస్తున్న పరీక్షలతో పాటు 'భారత్ NCAP 2.0' కింద కార్లు అనేక కొత్త ప్రమాణ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో 50 కిలోమీటర్లతో జరిగే ఫుల్-విడ్త్ ఫ్రంటల్ క్రాష్ టెస్ట్, 32 కిలోమీటర్ల వేగంతో నిర్వహించే ఓబ్లిక్ పోల్ ఇంపాక్ట్ టెస్ట్ , 50 కిలోమీటర్ల వేగంతో వెనుక నుంచి జరిగే ప్రమాదాలను తట్టుకునే రియర్-ఇంపాక్టు టెస్టులను చేర్చనున్నారు. దేశంలో రహదారి ప్రమాదాల మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ విప్లవాత్మక మార్పులు చేపడుతోంది.
“Govt to roll out Bharat NCAP 2.0 from October 2027.
— News Arena India (@NewsArenaIndia) September 3, 2026
It will assess the complete safety framework and will address the severe challenge of road accidents in the country.”
- Union Minister Nitin Gadkari pic.twitter.com/kTYhHNQiMu














Click it and Unblock the Notifications