Mutual Funds: చేతిలో పైసలు పదిలం!
షేర్ మార్కెట్ కళకళలాడుతోంది.. సూచీలు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాయి.. ఏప్రిల్ నెలలో ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. కానీ, ఆశ్చర్యకరంగా మన మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు మాత్రం కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి కాస్త వెనుకాడుతున్నారు. మార్కెట్ పెరుగుతున్నా, చేతిలో ఉన్న నగదును (Cash Reserves) స్టాక్స్లో పెట్టకుండా జాగ్రత్తగా దాచుకుంటున్నారు.
ఏప్రిల్ నెలలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గడంతో భారతీయ స్టాక్ మార్కెట్లు రాకెట్లా దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 7 శాతం, నిఫ్టీ 7.5 శాతం పెరిగాయి. ఇక మిడ్క్యాప్, స్మాల్క్యాప్ ఇండెక్స్లు అయితే ఏకంగా 12 నుంచి 18 శాతం వరకు వృద్ధి చెందాయి. సాధారణంగా ఇలాంటి సమయంలో ఫండ్స్ అన్నీ స్టాక్స్ కొనేందుకు పోటీ పడతాయి. కానీ ACE ఈక్విటీస్ నివేదిక ప్రకారం, విశ్లేషించిన 53 ఫండ్ హౌస్లలో 30 సంస్థలు తమ నగదు నిల్వలను పెంచుకున్నాయి. మార్చిలో రూ.1.86 లక్షల కోట్లుగా ఉన్న నగదు, ఏప్రిల్ నాటికి రూ.1.99 లక్షల కోట్లకు చేరింది.

ఎందుకు ఈ జాగ్రత్త?
మార్కెట్ వాల్యుయేషన్లు (ధరలు) చాలా ఎక్కువగా ఉన్నాయని, షేర్ల ధరలు వాటి అసలు విలువ కంటే ఎక్కువగా ఉన్నాయని ఫండ్ మేనేజర్లు భావిస్తున్నారు. ఏదైనా కారణంతో మార్కెట్ అస్థిరతకు గురైతే, ఇన్వెస్టర్ల సొమ్మును కాపాడటానికి ఈ నగదు నిల్వలు 'బఫర్'లా పనిచేస్తాయని వారి నమ్మకం. ఆదాయ స్పష్టత ఉండి, సరసమైన ధరల్లో షేర్లు దొరికినప్పుడే పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టాలని వారు వేచి చూస్తున్నారు.
ఎవరు పెంచారు? ఎవరు తగ్గించారు?
నగదు నిల్వలు పెంచుకున్న వాటిలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ (4.11%), డీఎస్పీ (6.82%), క్వాంట్ ఎమ్ఎఫ్ (14.38%) ముందున్నాయి. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ వంటి దిగ్గజాలు కూడా స్వల్పంగా నగదును పెంచుకున్నాయి. మరోవైపు, పీపీఎఫ్ఎఎస్ (PPFAS) తన నగదును 21.76 శాతం నుంచి 18.7 శాతానికి తగ్గించుకుని మార్కెట్లో పెట్టుబడులు పెట్టింది. యాక్సిస్, నిప్పన్ ఇండియా వంటి సంస్థలు కూడా ఇదే బాటలో నడిచాయి.
మొత్తానికి, మార్కెట్ పెరుగుతున్నా మ్యూచువల్ ఫండ్ మేనేజర్లు మాత్రం 'ఆచి తూచి' అడుగులు వేస్తూ, అప్రమత్తమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.














Click it and Unblock the Notifications