Universal Pension: అందరికీ పెన్షన్.. వృద్ధాప్యంలో ఆర్థిక భరోసాకు కేంద్రం కసరత్తు
దేశంలోని పౌరులందరికీ సామాజిక భద్రత కల్పించే లక్ష్యంతో సార్వత్రిక పెన్షన్ పథకాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే పెన్షన్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, అసంఘటిత రంగంలో పనిచేసేవారు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, చిన్న వ్యాపారులు వంటి కోట్లాది మందికి ఎలాంటి పెన్షన్ పథకం లేదు. వీరి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందిస్తోంది. ఈ పథకం ద్వారా దేశంలోని ప్రతి ఒక్క పౌరుడికి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం.
సార్వత్రిక పెన్షన్ పథకం లక్ష్యం:
ఈ స్కీమ్ ఉద్యోగులు, స్వయం ఉపాధిగల వ్యక్తులు, చిన్న వాణిజ్యదారులు, అసంఘటిత రంగ కార్మికులు సహా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు పెన్షన్ అందించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో చేరడానికి వయస్సు, ఆదాయ పరిమితి వంటి అంశాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే 60ఏళ్లు పైబడిన వారందరికీ పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ స్కీమ్పై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది.

పెన్షన్ మొత్తం:
ఎంత పెన్షన్ వస్తుంది అనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇది లబ్ధిదారుడు చెల్లించే ప్రీమియం, వయస్సు, ఇతర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కనీస పెన్షన్ గ్యారంటీతో కూడిన పథకాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం ఏదైనా కంపెనీలో ఒక వ్యక్తి పనిచేస్తున్నప్పుడు అతడి వేతనం నుంచి 12 శాతం చొప్పున అతడి పీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది. పనిచేస్తున్న సంస్థ కూడా అంతే మొత్తంలో జమ చేస్తుంది. వీరికి ప్రభుత్వం ఎలాంటి నిధులు జమ చేయదు.
ఆర్థిక భరోసా:
ప్రస్తుతం సంఘటిత రంగంలో పనిచేసే వారికి అటల్ పెన్షన్ యోజన, వీధి వ్యాపారుల కోసం ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్దాన్ యోజన, రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాన్దాన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి. ఈ పథకాల కింద కొంత మొత్తంలో పౌరులు చెల్లిస్తుండగా..ఇంకొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్క పౌరుడిని దృష్టిలో ఉంచుకుని .. వారికి వృద్ధాప్యంలో ఆర్థిక భరోసా కల్పించాలన్న లక్ష్యంతో కేంద్రం అడుగులు వేస్తోంది.
అయితే ప్రస్తుతం ఈ పథకం రూపకల్పన దశలో ఉంది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలను ప్రభుత్వం రూపొందిస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. అటు ఈ సార్వత్రిక పెన్షన్ పథకం పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరగా అమలు చేస్తే, దేశంలోని చాలా మంది వృద్ధాప్యంలో ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవించగలుగుతారు.












Click it and Unblock the Notifications