ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందాకొచ్చార్ రాజీనామా, ఆ స్థానంలో సందీప్ బక్షీ
ముంబై: ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచ్చార్ గురువారం రాజీనామా చేశారు. ఈ మేరకు ఐసీఐసీఐ బ్యాంక్ ఆమె రాజీనామాను ఆమోదించినట్లు ప్రకటించింది. ఆమె స్థానంలో సందీప్ భక్షి సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు.
పలు కారణాల వల్ల ముందుగానే రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను ఐసీఐసీఐ బోర్డు డైరెక్టర్లు ఆమోదించినట్లు ఈ రోజు వెల్లడించారు. చందా కొచ్చార్ స్థానంలో బాధ్యతలు చేపట్టనున్న సందీప్ బక్షి ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు.
సందీప్ బక్షి అయిదేళ్ళ పాటు ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో మరియు ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తారు. 3 అక్టోబర్ 2023 వరకు ఆయన ఈ పదవుల్లో ఉంటారు.
కాగా, చందా కొచ్చార్ పైన ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ విచారణలోని ఫలితాన్ని బట్టి ఉంటుందని బ్యాంకు తెలిపింది. చందాకొచ్చార్ రాజీనామాతో విచారణపై ఎలాంటి ప్రభావం పడదని తెలిపింది.
బ్యాంకు నుంచి లోన్లు తీసుకున్న వారి నుంచి చందాకొచ్చార్ లబ్ధి పొందారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ సాగుతోంది. ఈ ఆరోపణలు వచ్చినప్పుడు చందా కొచ్చార్ను సెలవులపై వెళ్లాలని బ్యాంక్ సూచించింది.
వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణ వ్యవహారంలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో చందా కొచ్చర్ సహాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆమె బ్యాంకు ఎండీ, సీఈవో పదవికి రాజీనామా చేశారు. దీనికి బోర్డు అంగీకరం తెలిపింది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తన పదవికి రాజీనామా చేశారని, దానిని ఆమోదించినట్లు ఐసీఐసీఐ రెగ్యులేటరీ ఫైలింగ్లో పేర్కొంది.
2012లో వీడియోకాన్ గ్రూప్కు రూ..3,250కోట్ల విలువైన రుణాలను మంజూరు చేసేందుకు క్విడ్ ప్రోకో ప్రాతిపదికన చందా కొచ్చార్ సహాయం చేసినట్లు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసును సీబీఐ, ఐటీ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు కూడా స్వతంత్ర దర్యాఫ్తుకు ఆదేశించింది.