సీఎం విజయ్ సైనింగ్ ఇన్ స్టైల్- తమిళనాడులో రూ. లక్ష కోట్ల పెట్టబడులు.. !!
ముఖ్యమంత్రి విజయ్ సారథ్యంలో తమిళనాడులో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వం పెట్టుబడుల వేటలో పడింది. ఈ దిశగా కీలక ముందడుగు వేసింది. వెట్రి తమిళనాడు కంక్లేవ్ సమ్మిట్ ను నిర్వహించింది. చెన్నై ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో ఏర్పాటైన ఈ సదస్సును విజయ్ స్వయంగా ప్రారంభించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి 100 రోజుల్లోనే టీవీకే ప్రభుత్వం ఈ భారీ ఇండస్ట్రియల్ సమ్మిట్ ను ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో భారీ స్థాయిలో అంతర్జాతీయ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది. ఎల్ అండ్ టీ- రూ. 18,600 కోట్లు, హిటాచి- రూ. 1,000 కోట్లు, విక్రమ్ సోలార్- రూ. 15,037 కోట్లు, ఛుబ్- నోర్డెక్స్- రూ. 425 కోట్లు ఉన్నాయి. విజయ్ సమక్షంలో రష్యా, న్యూజిలాండ్, కజకిస్తాన్ వంటి దేశాలకు చెందిన విభిన్న ప్రతిష్టాత్మక సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. మొత్తం 104 కంపెనీలు ఎంఓయూలను కుదుర్చుకున్నాయి. వీటి విలువ 1,02 లక్షల కోట్ల రూపాయలు. వీటి ద్వారా 1.25 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వంటి సాంకేతిక రంగాల్లో ఆయా సంస్థలు తమిళనాడులో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. వెట్రి కంక్లేవ్ లో భాగంగా ఇన్వెస్ట్ కజకిస్తాన్ సంస్థ రెండు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర పెట్టుబడులను పెంచడమే లక్ష్యంగా సెప్టెంబర్లో సుమారు 100 మంది సభ్యులతో కూడిన ఓ వాణిజ్య బృందాన్ని తమిళనాడుకు పంపించనుంది.
అలాగే న్యూజిలాండ్కు చెందిన బిజినెస్ కౌన్సిల్ అక్టోబర్ లో క్రైస్ట్చర్చ్ నగర మేయర్ నేతృత్వంలోని ప్రత్యేక ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర పర్యటనకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయనుంది. తమిళనాడు పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టిడ్కో), బాష్ గ్లోబల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ సంయుక్తంగా సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో ఒక ప్రత్యేక నైపుణ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి.
ఈ కేంద్రం ద్వారా 10,000 మంది విద్యార్థులు, టెక్నాలజీ నిపుణులకు ఉపాధి అవకాశాలు అందిస్తుందని ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు సుమారు 500కు పైగా స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు టెక్నాలజీని ఇచ్చిపుచ్చుకుంటుందని పేర్కొంది. కోయంబత్తూరులో వోవ్సెమీ సంస్థ 75 కోట్ల రూపాయల పెట్టుబడితో ఓ సెమీకండక్టర్ స్కిల్లింగ్ అకాడమీని ప్రారంభించబోతోంది. ఈ మేరకు ఎంఓయూను కుదుర్చుకుంది.
ఈ సెమీకండక్టర్ అకాడమీ ద్వారా రాబోయే అయిదేళ్ల కాలంలో 75,000 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వనుంది. రాబోయే రెండేళ్లలో వేఫర్ ఆన్ వీల్స్ పేరిట ఓ ఇన్ క్యుబేటర్ సెంటర్ కూడా ఏర్పాటు కానుందక్కడ. రష్యాకు చెందిన ప్రముఖ ఆర్థిక సంస్థ స్బెర్బ్యాంక్ (Sberbank), తమిళనాడు ప్రభుత్వంతో చేతులు కలిపింది, విద్యా, వైద్య, పట్టణాభివృద్ధి రంగాలలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మార్పిడి చేసుకునేందుకు ముందుకొచ్చింది.
ఐడియా టు ఇంపాక్ట్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో గైడెన్స్ తమిళనాడు సంస్థ మూడేళ్ల కాలపరిమితితో వాల్మార్ట్ విస్తరణ ప్రణాళికను అమలు చేయనుంది. దీనివల్ల తమిళనాడులోని పరిశ్రమలకు ఆధునిక వాణిజ్యం, ఈ-కామర్స్ వంటి రంగాల్లో అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం వివరించింది. చెన్నై, కోయంబత్తూరు, కాంచీపురం, మధురై, సేలం, తూత్తుకుడి, తిరుపూర్, తిరువళ్లూరు, వేలూరుల్లో స్థానిక తయారీదారుల నైపుణ్యాలను పెంపొందించి, వారి ఉత్పత్తులను జాతీయ, అంతర్జాతీయ మార్కెటింగ్ అవకాశాలను కల్పిస్తారు.















Click it and Unblock the Notifications