బ్యాంకింగ్ ‘సంక్షోభం’: మొండి బాకీలతో లాభాలు హరీ! తగ్గిపోతున్న ప్రజా విశ్వాసం
ముంబై: ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బ్యాంకులే మూలాధారం. ద్రవ్య విధానం సజావుగా సాగాలన్నా.. ప్రజలు పొదుపు బాట పట్టాలన్నా, వారి కష్టార్జితం పదింతలు కావాలన్నా, అది భద్రంగా ఉండాలన్నా బ్యాంకులే ప్రధానం. వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఆర్థిక చేయూత లభించాలన్నా బ్యాంకులే కీలకం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థకు బలమైన బ్యాంకులే పునాదులు. అటువంటి బ్యాంకింగ్ వ్యవస్థ దేశంలో ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకున్నది. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉనికికే ముప్పు ఏర్పడింది. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో వెలుగు చూస్తున్న వరుస పరిణామాలు ఇదే చెబుతున్నాయి.
ఒక వైపు బ్యాంకుల మనుగడే ప్రశ్నార్థకం చేస్తూ లాభాలను హరిస్తున్న మొండి బకాయిలు, మరోవైపు మోసగాళ్లతో చేతులు కలిపి ప్రతిష్ఠను దిగజారుస్తున్న ఇంటిదొంగలు, ఇంకోవైపు ప్రభుత్వ విధానాలు, బ్యాంకర్ల నిర్ణయాలతో దెబ్బతింటున్న ఖాతాదారుల విశ్వాసం, ఇంకా వేధిస్తున్న మూలధనం కొరత.. వెరసి బ్యాంకింగ్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టాయి. ఇక బడా కార్పొరేట్ల మోసాలకు బ్యాంకుల్లోని ఉన్నతస్థాయి సిబ్బంది అండగా నిలబడుతుండటం.. బ్యాంకుల నష్టాల్ని మరింతగా పెంచుతున్నాయి.

ప్రభుత్వ బ్యాంకుల మొండి బకాయిలే రూ.8.5 లక్షలు
బ్యాంకింగ్ రంగంలో సంక్షోభంలో ఈ ఆర్థిక సంవత్సరం (2017-18) మూడో త్రైమాసికానికి (అక్టోబర్ - డిసెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రకటించిన ఆర్థిక ఫలితాలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మొత్తం 21 సర్కారీ బ్యాంకుల్లో 16 సంస్థల నష్టాలు రూ.18వేల కోట్లకు పైగా నమోదయ్యాయి. మరో నాలుగు సంస్థల లాభాలు గతంతో పోల్చితే క్షీణించాయి. దీనికి కారణం వాటి మొండి బకాయిలే కారణం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాల ప్రకారం భారతీయ బ్యాంకింగ్ రంగంలో రూ.10 లక్షల కోట్లకు పైగా మొండి బకాయిలు ఉండగా, ప్రభుత్వ బ్యాంకులకు చెందినవే రూ.8.50 లక్షల కోట్లు.

బ్యాంకింగ్ వ్యవస్థనే కుదిపేస్తున్న పీఎన్బీ మోసం
దేశీయ ప్రభుత్వ బ్యాంకుల్లో రెండో అతిపెద్ద బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) కుంభకోణం ఇప్పుడు యావత్ బ్యాంకింగ్ రంగంతోపాటు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థనే కుదిపేస్తున్నది. రూ.12,700 కోట్ల ఈ భారీ స్కాం.. ఇప్పటిదాకా బయటపడిన అన్ని బ్యాంక్ మోసాల్లోకెల్లా భారీదన్న సంగతి తెలిసిందే.మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్టేకింగ్.. అండర్స్టాండింగ్ (ఎల్వోయూ) లతో ఈ కుంభకోణం జరుగగా, వజ్రాలు, ఆభరణాల వ్యాపారులైన నీరవ్ మోదీ, ఆయన మేనమామ మెహుల్ చోక్సీలతో చేతులు కలిపిన కొందరు ఉన్నతోద్యోగులు ఏడేండ్లపాటు ఈ దోపిడీని నడిపించారు. ఈ మామాఅలుళ్ల గిల్లుడుకు పీఎన్బీ పరువు మంట కలిసిపోగా, విదేశాలకు పారిపోయిన వీరిని పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు నానా ఇబ్బందులు పడుతున్నాయి.

ఓబీసీ, కెనరా బ్యాంకులకు టోకరా ఇలా
రొటోమాక్ విక్రమ్ కొఠారీ, సింభౌలీ షుగర్స్, ద్వారకా దాస్ సేథ్, ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్ మోసాలు, రుణ ఎగవేతలూ ఇటీవలికాలంలో బయటపడ్డవే. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఓబీసీ), కెనరా తదితర బ్యాంకులు వీటివల్ల నష్టపోయాయి. ఇక రూ.9,000 కోట్లు ఎగ్గొట్టి లండన్కు పారిపోయిన కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా సంగతి విదితమే. సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఎస్ఎఫ్ఐవో వంటి దర్యాప్తు సంస్థలు వీటన్నిటిపై విచారిస్తుండగా, మరెందరో బడా బాబులు బ్యాంకుల్ని ఎంచక్కా దోచుకుపోతున్నారు.

ఆర్థిక నేరగాళ్ల పట్టివేతకు ప్రతిపాదిత చట్టంలోనూ లొసుగులే
సామాన్యుల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించే బ్యాంకర్లు.. వీరి విషయంలో మాత్రం చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు తెచ్చినా.. వాటిలోని లొసుగులు అక్రమార్కులకు చుట్టాలే అవుతున్నాయి. పారిపోయిన ఆర్థిక నేరగాళ్లకు సంబంధించి తాజాగా ప్రతిపాదించిన చట్టంపైనా విమర్శలే వ్యక్తమవుతుండటం గమనార్హం. మొండి బకాయిల్లో కార్పొరేట్లవే ఎక్కువగా ఉండగా, వీటిలో 25 శాతం 12 సంస్థలవే. అసలే పెట్టుబడి కొరతను ఎదుర్కొంటున్న బ్యాంకులకు.. ఎన్పీఏలు, ఎగవేతలు, మోసాలతో బాసెల్-3 నిబంధనల్ని అందుకోవడం కష్టతరమవుతున్నది.

నిర్వహణాపరమైన లాభాలను దెబ్బ తీస్తుందని ఆందోళన
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017-18) ప్రథమార్ధం (ఏప్రిల్-సెప్టెంబర్)లో 38 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులకు చెందిన రూ.516 కోట్ల మొం డి బకాయిల్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు రద్దు చేశాయి. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈ మేరకు వివరాల్ని వెల్లడించింది. బ్యాలెన్స్ షీట్లను క్లీన్ చేయడంలో భాగంగానే ఈ రద్దని ఓ అధికారి చెప్పారు. ఇది బ్యాంకుల నిర్వహణపరమైన లాభాల్ని దెబ్బ తీస్తుందని చెప్పారు.

ఉద్దేశ పూర్వక ఎగవేతలు రూ.92,376 కోట్లు
కాగా, గతేడాది మార్చి నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్దేశ పూర్వక ఎగవేతదారుల వల్ల పేరుకున్న బకాయిల్లో ఎస్బీఐకి చెందినవే 27 శాతానికిపైగా ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలియజేశాయి. మార్చి 31 నాటికి ఎస్బీఐలో 1,762 ఉద్దేశపూర్వక ఎగవేతదారుల బకాయిల విలువ రూ.25,104 కోట్లు. 1,120 మంది ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు చెందిన రూ.12,278 కోట్ల బకాయిలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో స్థానంలో ఉంది. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల రుణాల్లో ఈ రెండు బ్యాంకుల వాటానే 40 శాతమని తేలింది. ప్రభుత్వ బ్యాంకుల మొండి బకాయిల్లో 8,915 మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల బకాయిలు రూ.92,376 కోట్లుగా ఉన్నవి.

ఎగవేతదారులపై యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఇలా
దివాలా ప్రక్రియలో భాగంగా జరిపే ఆస్తుల వేలంలో డిఫాల్టర్లుగా ముద్రపడిన వారికి పాల్గొనే అవకాశం ఇవ్వొద్దని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ అన్నారు. ఈ దిశగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్స్ (ఎన్సీఎల్టీలు)ను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దివాలా ఆస్తుల వేలానికి సంబంధించి బిడ్డింగ్లో డిఫాల్టర్లకు చోటు దక్కరాదని, ఆయా ఆస్తులను అసలు యజమానులే మళ్లీ వాటిని చేజిక్కించుకునే వీలుందన్నారు. రుణ సంస్కృతి మరింత ఉన్నతంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఎంతకీ వసూలుకాని మొండి బకాయిల్లో తనఖా పెట్టిన ఆస్తుల్ని వేలం ద్వారా అమ్మేయాలని బ్యాంకులకు ఆర్బీఐ సూచిస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications