ఏడాదికే గ్రాట్యుటీ.. ఐదేళ్ల నిరీక్షణకు చెక్
సాధారణంగా ఒక సంస్థలో ఐదేళ్ల పాటు నిరంతర సేవలు అందిస్తేనే గ్రాట్యుటీ పొందే అవకాశం ఉండేది. కానీ, మారుతున్న పని సంస్కృతిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనను సవరించింది. 2025 నవంబర్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త కార్మిక కోడ్ ప్రకారం, ఇకపై కేవలం ఒక సంవత్సరం సర్వీసు పూర్తి చేసుకున్న వారికే గ్రాట్యుటీ పొందే హక్కు లభించనుంది. దీనివల్ల ముఖ్యంగా స్వల్పకాలిక ఒప్పందాల మీద పనిచేసే కార్మికులకు పెద్ద ఎత్తున మేలు జరగనుంది.
ఈ ఏడాది గ్రాట్యుటీ నిబంధన అందరికీ వర్తిస్తుందా? అంటే.. ప్రభుత్వం దీనిపై స్పష్టతనిచ్చింది. ఇది ప్రధానంగా 'ఫిక్స్డ్ టర్మ్' (Fixed Term), కాంట్రాక్ట్ కార్మికులకు వర్తిస్తుంది. అంటే ఒకటి లేదా రెండు ఏళ్ల ఒప్పందంపై చేరిన ఉద్యోగులు, వారి సేవా కాలానికి అనుగుణంగా 'ప్రొ-రేటా' (Pro-rata) పద్ధతిలో గ్రాట్యుటీని క్లెయిమ్ చేసుకోవచ్చు.

అయితే, సంస్థలో శాశ్వత ఉద్యోగులుగా ఉన్నవారు మాత్రం పాత నిబంధన ప్రకారమే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ దురదృష్టవశాత్తు మరణం లేదా వైకల్యం సంభవించినప్పుడు మాత్రం ఈ కాలపరిమితితో సంబంధం లేకుండా గ్రాట్యుటీ అందుతుంది.
జీతం లెక్కల్లో మార్పు.. పెరగనున్న గ్రాట్యుటీ మొత్తం.
కొత్త చట్టం ప్రకారం గ్రాట్యుటీ లెక్కింపు విధానం కూడా మారింది. ఇకపై ఉద్యోగి మొత్తం కాస్ట్-టు-కంపెనీ (CTC)లో కనీసం 50 శాతం వేతనంగా ఉండాలి. బేసిక్ పే, కరువు భత్యం (DA) వంటివి కలిపి ఈ 50 శాతం లెక్కగడతారు. దీనివల్ల గతంలో తక్కువ బేసిక్ పే ఉండి, ఎక్కువ అలవెన్సులు తీసుకునే ఉద్యోగులకు ఇప్పుడు గ్రాట్యుటీ రూపంలో అందే మొత్తం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇది ఉద్యోగులకు పదవీ విరమణ సమయంలో మరింత ఆర్థిక భద్రతను కల్పిస్తుంది.
అమలు ఎప్పటి నుంచి?
కార్మిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ కొత్త నిబంధనలు 2025 నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఆ తేదీన లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులందరికీ ఈ కొత్త చట్టం వర్తిస్తుంది. కంపెనీలు కూడా తమ అకౌంటింగ్ నిబంధనలను ఈ కొత్త కోడ్కు అనుగుణంగా మార్చుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. లక్షలాది మంది వ్యవస్థీకృత రంగ కార్మికులకు ఈ నిర్ణయం ఒక గొప్ప వరంగా మారనుంది.












Click it and Unblock the Notifications